సీఎం మాటలకు భయపడే కాలేజీలు తెరిచారు : శ్రీనివాస్ గౌడ్

సీఎం మాటలకు భయపడే కాలేజీలు తెరిచారు :  శ్రీనివాస్ గౌడ్
  • ప్రైవేటు కాలేజీలు డొనేషన్ల పేరుతో దోచుకుంటున్నాయన్న సీఎం వ్యాఖ్యలు నిజమేనేమో: శ్రీనివాస్ గౌడ్

బషీర్​బాగ్, వెలుగు: ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు డొనేషన్ల పేరుతో కోట్లు దోచుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజమే కావొచ్చునని మాజీ శ్రీనివాస్‌‌ గౌడ్ అన్నారు. ఆ మాటలకు భయపడే యాజమాన్యాలు కాలేజీలను ఓపెన్ చేశాయని వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్‌‌క్లబ్‌‌లో తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 

విద్యార్థులకు అన్యాయం చేసే ఏ పార్టీనైనా వ్యతిరేకిస్తామని చెప్పారు. తమ పదేండ్ల పాలనలో ఎన్ని ఫీజు బకాయిలు ఉన్నాయో, ఈ రెండేండ్ల కాంగ్రెస్ హయాంలో ఎన్ని ఉన్నాయో లెక్కలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌ను ఎవరెంత బకాయి పెట్టారో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. కాలేజీల యాజమాన్యాలు బకాయిల పేరుతో విద్యార్థులను , సిబ్బందిని వేధిస్తే తాము చూస్తూ ఉండబోమని హెచ్చరించారు. 

ఈ నెల 15న ఫీజు పోరు పేరిట విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. కాగా, బీఆర్ఎస్ కంటే మెరుగ్గా పాలన అందిస్తారనే కాంగ్రెస్‌‌కు ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారని, తాము చేసిన తప్పిదాలు కాంగ్రెస్ చేయొద్దనే ఆ పార్టీని ఎన్నుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకుడు సంజయ్, కాకతీయ యూనివర్సిటీ జేఏసీ నాయకుడు హరికృష్ణ, తెలంగాణ యూనివర్సిటీ జేఏసీ నాయకుడు సాహిత్, జూనియర్ న్యాయవాదుల సంఘం రాష్ట్ర నేతలు పాల్గొన్నారు.