మోడల్ స్కూళ్ల టీచర్లకు త్వరలో కేడర్ విభజన

మోడల్ స్కూళ్ల టీచర్లకు త్వరలో కేడర్ విభజన
  • ప్రెసిడెన్షియల్​ ఆర్డర్ అమలుకు సీఎం రేవంత్ ఆమోదం 
  • టీచర్ల ప్రమోషన్లకు లైన్ క్లియర్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న సిబ్బందికి త్వరలోనే కేడర్ విభజన జరగనున్నది. దీనికి సంబంధించిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్–2018 అమలుకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఫైల్​పై ఆయన సంతకం చేశారు. దీంతో మోడల్ స్కూళ్లలోని ఉద్యోగులకు ప్రమోషన్ల ప్రక్రియ అడ్డంకులు తొలగినట్టు అయింది. రాష్ట్రవ్యాప్తంగా 194 మోడల్ స్కూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2,808 మంది రెగ్యులర్ టీచర్లు పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేడర్ విభజన కోసం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆధారంగా జీవో 317 రిలీజ్ చేసింది. అన్ని డిపార్ట్​మెంట్లలో ఇది అమలు జరిగినా.. ఇద్దరు టీచర్లు కోర్టుకు పోవడంతో ఆ ప్రక్రియ అమలు కాలేదు. తాజాగా కోర్టుకు పోయిన టీచర్లను మినహాయించి, జీవో 317 అమలు చేయొచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది. 

ఈ తీర్పు అమలు కోసం అధికారులు సర్కారుకు ఫైల్ పెట్టగా, సీఎం రేవంత్ ఆమోదం తెలిపారు. మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లకు కొత్త జోనల్ విధానం ప్రకారం కేడర్ విభజన జరగనున్నది. స్టేట్​లో 99 మంది ప్రిన్సిపాల్స్, 1,956 మంది పీజీటీలు, 753 మంది టీజీటీలు పనిచేస్తున్నారు. ప్రిన్సిపల్, పీజీటీలు మల్టీజోన్ పరిధిలోకి రాగా, టీజీటీలు జోనల్ కిందికి రానున్నారు. ఇటీవలే బదిలీలు జరిగిన నేపథ్యంలో కేడర్ విభజన చేసి.. ప్రమోషన్ల ప్రక్రియ మొదలు పెట్టనున్నారు. ఆ తర్వాత మోడల్ స్కూళ్లలోని ఖాళీలూ భర్తీ చేయనున్నారు.

వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలి: టీచర్ల సంఘాలు

ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమలుకు ఆమోదం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు, ప్రొగ్రెసీవ్ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీశ్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా వెంటనే ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు మోడల్ స్కూల్ సిబ్బందికి 010 పద్దు కింద వేతనాలు ఇవ్వాలని కోరారు.