
హైదరాబాద్, వెలుగు: దేశంలో ప్రస్తుతం రెండు పరివార్ల మధ్య యుద్ధం జరుగుతున్నదని.. రాజ్యాంగాన్ని మార్చేందుకు గాడ్సే పరివార్ కుట్రలు చేస్తుంటే, రాజ్యాంగ పరిరక్షణ కోసం గాంధీ పరివార్ పోరాడుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజ్యాంగ రక్షణ కోసం గాంధీ పరివార్ తరఫున పోరాడుతున్న రాహుల్ గాంధీకి దేశ ప్రజలంతా మద్దతుగా నిలవాలని కోరారు. సోమవారం మధ్యప్రదేశ్లోని మహూలో ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ పేరిట ఏఐసీసీ నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ర్యాలీలో సీఎం మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ జరుగుతున్న ర్యాలీ ఎన్నికల కోసం కాదు. ఇది ఒక యుద్ధం. ఈ యుద్ధం.. రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడేవారికి, రాజ్యాంగాన్ని మార్చాలనుకునేవారికి మధ్య జరుగుతున్నది’’ అని తెలిపారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయాన్ని రాహుల్ గాంధీ ముందుగానే గుర్తించి పోరాటం చేస్తున్నారని చెప్పారు.
‘‘గజనీ మహమ్మద్ హిందుస్తాన్ ను దోచుకోవడానికి ప్రయత్నించినట్లు, ఇప్పుడు మోదీ కూడా రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నరు. ఆయన ప్రయత్నాలు ఫలించవు. ఎందుకంటే, ఆనాడు బ్రిటిషర్ల నుంచి మహాత్మా గాంధీ దేశాన్ని రక్షించినట్లు.. భారతీయ జనతాపార్టీ పేరుతో చలామణి అవుతున్న బ్రిటిష్ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు రాహుల్ గాంధీ నిలబడ్డారు. ఈ యుద్ధంలో కాంగ్రెస్ కేడర్ మొత్తం రాహుల్ గాంధీతో కలిసి నడవాలి” అని రేవంత్ పేర్కొన్నారు.
బీజేపీ.. హిడెన్ ఎజెండా
రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ హిడెన్ ఎజెండాతో పనిచేస్తున్నదని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. ‘‘ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. లోక్ సభ ఎన్నికల సమయంలో దేశ ప్రజలను బీజేపీ 400 సీట్లు అడిగింది.. ‘‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లింది.. అన్ని సీట్లు వస్తే రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను రద్దు చేయొచ్చన్న హిడెన్ ఎజెండా ఉంది. ఆ కుట్రలను పసిగట్టిన దేశ ప్రజలు కేవలం 240 సీట్లకే పరిమితం చేశారు” అని పేర్కొన్నారు. లోక్ సభ ఫలితాలు వచ్చినప్పటి నుంచి బీజేపీ నేతల్లో ఆందోళన కనిపిస్తున్నదని అన్నారు.
బీజేపీ కుట్రలు తిప్పికొడదాం
బీజేపీ కుట్రలను తిప్పికొట్టేందుకే కాంగ్రెస్ పార్టీ ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ ర్యాలీని నిర్వహిస్తున్నదని సీఎం రేవంత్ అన్నారు. జోడో యాత్రలో కూడా రాజ్యాంగం, రిజర్వేషన్ల పరిరక్షణే కాంగ్రెస్ విధానమని రాహుల్గాంధీ స్పష్టం చేశారని ఆయన గుర్తుచేశారు. అందుకే ఆ మాటకు కట్టుబడే కాంగ్రెస్ పోరాటం చేస్తున్నదని తెలిపారు. ‘‘బీజేపీకి రాజ్యాంగం అన్నా, రిజర్వేషన్లు అన్నా.. నవ్వులాటగా మారాయి” అని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ కాపాడుతున్నదని సీఎం అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే రాజ్యాంగానికి పూర్తి రక్షణ ఉంటుందని తెలిపారు. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం నాగోబా జాతర శుభాకాంక్షలు
హైదరాబాద్, వెలుగు: దేశంలోనే రెండో అతి పెద్ద గిరిజన జాతరైన నాగోబా జాతర సందర్భంగా భక్తులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మెస్రం వంశస్తుల ఆధ్వర్యంలో జరిగే నాగోబా జాతర అయిదు రోజుల పాటు వేడుకగా సాగుతుందని, భక్తులు నాగోబాను దర్శించుకొని ఆశీస్సులు అందుకోవాలని ఆకాంక్షించారు. అధికారికంగా నిర్వహిస్తున్న జాతరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
నేడు పొద్దుటూరుకు రేవంత్
చేవెళ్ల, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండల పరిధిలోని పొద్దుటూరు గ్రామంలో పర్యటించనున్నారు. అతిపెద్ద 'ఎక్స్ పీరియం' ఎకో ఫ్రెండ్లీ పార్క్ ను ఆయన ప్రారంభించనున్నారు. ఈ మేరకు పార్క్ రూపకర్త, చైర్మన్ రాందేవ్ రావు సోమవారం ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా పొద్దుటూరులో150 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద 'ఎక్స్ పీరియం' ఎకో ఫ్రెండ్లీ పార్క్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో 25వేల జాతుల మొక్కలు ఉన్నాయన్నారు. ఈ పార్క్ ను ప్రకృతి ప్రేమికుల కోసమే గాక, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం కల్పించేలా రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు.