
- ఏజెన్సీ ఇచ్చిన అంచనా వ్యయాలను పరిశీలిస్తున్న ఆర్ అండ్ బీ, పీఆర్ ఆఫీసర్లు
- త్వరలో జీఓలు.. కాంట్రాక్టర్లతో ఆఫీసర్ల మీటింగ్
- టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో ఆర్ అండ్ బీ, పంచాయతీ రోడ్ల రిపేర్ల పనులకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైబ్రీడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) పద్ధతిలో చేపట్టనున్న రోడ్ల రిపేర్ల ప్రాజెక్టుకు ఈనెల 5న కేబినెట్ ఆమోదం తెలిపింది. రెండు రోజుల్లో ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖ నుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించి జీఓలు రానున్నాయి. ఈ రెండు శాఖల రోడ్ల మరమ్మతులకు సంబంధించి ఆర్వీ అసోసియేట్, లీ కన్సల్టెన్సీ ఇచ్చిన అంచనా వ్యయాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
రోడ్ల రిపేర్లు ప్రారంభించేందుకు ఆసక్తి ఉన్న కాంట్రాక్టర్లతో రెండు శాఖల అధికారులు ఈ వారంలో మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ లో రెండు శాఖలకు సంబంధించి చేపట్టాల్సిన రోడ్ల రిపేర్లు, అంచనా వ్యయం, కాల పరిమితి, నిధుల సమీకరణ, బ్యాంక్ గ్యారంటీ, అగ్రిమెంట్లు వంటి వివరాలను అధికారులు కాంట్రాక్టర్లకు వివరించనున్నారు.
తొలి దశలో 13 వేల కి.మీ. రిపేర్లు
రాష్ట్రవ్యాప్తంగా గత పదేళ్లలో మరమ్మతులకు నోచుకోని ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖల రోడ్లకు హామ్ పద్ధతిలో రిపేర్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా టెండర్లు పిలిచి ఏ రోడ్లు మరమ్మతులు చేయాలో సర్వే చేసి 9 నెలల్లో రిపోర్టు ఇవ్వాలని ఆర్వీ అసోసియేట్, లీ కన్సల్టెన్సీకి ప్రభుత్వం సూచించింది. ఈ సంస్థ గత కొన్ని నెలలుగా అన్ని జిల్లాల్లో సర్వే పూర్తి చేసింది.
ఆర్ అండ్ బీ పరిధిలో 5,156 కిలోమీటర్ల రోడ్లు, పంచాయతీ రాజ్ పరిధిలో 7,947 కిలోమీటర్ల రోడ్లకు మొదటి దశలో మరమ్మతులు చేయనున్నారు. పంచాయతీ రాజ్ రోడ్ల రిపేర్లు ఎక్కువగా ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో ఉన్నాయి. ఈ మూడు జిల్లాల్లో 3,350 కి.మీ రోడ్లు ఉన్నాయి. ఆర్ అండ్ బీ రోడ్లలో ఎక్కువగా కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉన్నాయి. రాష్ర్టంలో పంచాయతీ రాజ్ రోడ్లకు మూడు దశల్లో 12 వేల కిలోమీటర్లు, ఆర్ అండ్ బీ పరిధిలో మూడు దశల్లో 11,800 కి.మీ హ్యామ్ మోడల్ లో రిపేర్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ పద్ధతిలో 40 శాతం వ్యయాన్ని టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ భరించనుండగా..0 మిగతా 60 శాతం నిధులను దశలవారీగా సదరు కాంట్రాక్టర్ కు ప్రభుత్వం చెల్లిస్తుంది. రోడ్డు పూర్తయిన తరువాత 15 ఏళ్ల పాటు కాంట్రాక్టర్ రోడ్డును మెయింటెన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ రోడ్లకు డీపీఆర్ లు రెడీ చేసే పనిలో రెండు శాఖల అధికారులు నిమగ్నమయ్యారు.
ఇదీ హ్యామ్ మోడల్
గతంలో రహదారుల నిర్మాణం పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే సాగేవి. రహదారుల నిర్మాణంలో పెరిగిన వ్యయాలు, మారిన సాంకేతికత, ప్రభుత్వానికి ఉన్న ఇతర పనుల నేపథ్యంలో రహదారుల నిర్మాణంలో వివిధ నూతన పద్ధతులు వచ్చాయి. అలా వచ్చినవే ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ), బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (బీఓటీ), హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎం). ఈపీసీ, బోఓటీల కలయికే హ్యామ్ అని అధికారులు చెబుతున్నారు.
ఈ విధానంలో రహదారి డిజైన్లు, ఆ మార్గంలో వాహనాల రాకపోకలు, ఏ రకమైన నాణ్యతా ప్రమాణాలతో రహదారులు నిర్మించాలి అన్న వివరాలపై ప్రైవేటు సంస్థలు లేదా కాంట్రాక్టర్లు పూర్తిగా తమ సొంత నిధులతో డీపీఆర్లు రూపొందిస్తారు. ఆ డీపీఆర్లను పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాతే ప్రభుత్వం వాటిని ఆమోదిస్తుంది. హ్యామ్ విధానంలో రహదారుల నిర్మాణాన్ని కాంట్రాక్టర్లు లేదా కాంట్రాక్టు సంస్థలు చేపడతాయి.
ఆగస్టు చివరి నుంచి పనులు
వర్షాకాలం ప్రారంభం కావడంతో మూడు నెలల పాటు నిత్యం వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రోడ్ల రిపేర్ల పనులను ఆగస్టు చివరి నుంచి స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు. వర్షాకాలం పూర్తయిన తరువాత వర్షాలకు డ్యామేజ్ అయిన రోడ్ల సంఖ్య, రిపేర్లు చేయాల్సిన రోడ్ల సంఖ్య కూడా పెరగనుంది.
వీటికి రెండో దశలో రిపేర్లు చేయనున్నారు. గత ఏడాది భారీగా కురిసిన వర్షాలు, వరదలతో వేల కిలోమీటర్ల మేర పీఆర్, ఆర్ అండ్ బీ రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతోపాటు పలు బ్రిడ్జీలు కూడా పూర్తిగా కొట్టుకుపోయాయి. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నిధులతో తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు.