
- ఫిజిక్స్ వాలా సంస్థతో సర్కారు ఒప్పందం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో చదివే విద్యార్థులకు ‘తెలంగాణ అచీవర్స్ 2025’ పేరుతో వివిధ కోర్సుల్లో ఉచిత కోచింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జేఈఈ, నీట్, క్లాట్ తదితర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు క్వాలిటీ ఆన్ లైన్ కోచింగ్ ఇవ్వనుంది. ఎడ్ టెక్ సంస్థ ఫిజిక్స్ వాలా సహకారంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది. శుక్రవారం ఇంటర్ బోర్డు ఆఫీసులో సమావేశం జరిగింది.
దీనిలో విద్యా శాఖ సెక్రటరీ యోగితా రాణా, ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, ఇంటర్ బోర్డు సీఓఈ జయప్రదబాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జులై నుంచి డిసెంబర్ వరకు తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ఆన్లైన్లో ఉచిత కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతి విద్యార్థికి లాగిన్ ఇచ్చి, దాని ద్వారా లైవ్ లేదా రికార్డెడ్ ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించనున్నారు. దీంట్లో పదేండ్ల జేఈఈ, నీట్ క్వశ్చన్ పేపర్లూ అందుబాటులో ఉంచనున్నారు.