
- అసంపూర్తిగా ఉన్న ఇండ్లు పూర్తి చేసుకోండి: మంత్రి పొంగులేటి
- అర్హులకు న్యాయం చేస్తామని హామీ
- ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అధికారులతో సమీక్ష
హైదరాబాద్/నేలకొండపల్లి, వెలుగు: అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే.. లబ్ధిదారులకు రూ.5 లక్షలు ఇస్తామని, వాళ్లే పనులు కంప్లీట్ చేసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో.. జాగా లేని అర్హత కలిగిన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయిస్తామని తెలిపారు. సోమవారం సెక్రటేరియెట్లో ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం, మౌలిక వసతులపై అధికారులతో మంత్రి సమీక్ష చేశారు.
కాంట్రాక్టర్ మోడ్ నుంచి లబ్ధిదారుల నేతృత్వంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని నిర్ణయించాం. నిరుపేదలకు నీడ కల్పించడం ప్రభుత్వాల కర్తవ్యం. గత బీఆర్ఎస్ సర్కార్ తమ కర్తవ్యం నెరవేర్చలేదు. పదేండ్లలో 60 వేల ఇండ్లను మాత్రమే అరకొరగా పూర్తి చేసింది. వాటిలో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యాల్లేవు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మౌలిక వసతులు కల్పించింది. అసంపూర్తిగా ఉన్న 1.61 లక్షల ఇండ్లను రూ.640 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేసింది. 98వేల మంది లబ్ధిదారులకు కేటాయించింది.
ఇంకా 69 వేల ఇండ్లు అసంపూర్తిగా ఉన్నాయి. వీటిని బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్ మోడ్లో పూర్తి చేస్తాం. ఈ ఏడాది రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటి వరకు 2.65 లక్షల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇచ్చాం’’అని మంత్రి తెలిపారు. 71 వేల ఇండ్ల పనులు ప్రారంభం అయ్యాయని.. వీటిలో 3 వేల ఇండ్లు గోడలు, శ్లాబ్ వరకు కంప్లీట్ అయినట్లు చెప్పారు.
వచ్చే మూడున్నరేండ్లలో 20 లక్షల ఇండ్లు
వచ్చే మూడున్నరేండ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం, కొరట్లగూడెం, ముఠాపురంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘పాలేరు నియోజకవర్గంలో వివిధ పనులకు ప్రభుత్వం రూ.14 కోట్లు మంజూరు చేసింది.
ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు శాంక్షన్ చేశాం. ఎవరికైనా ఇల్లు రాకపోయి ఉంటే బాధపడొద్దు. అర్హులందరికీ న్యాయం చేస్తాం. ఇప్పటికే 200 యూనిట్లు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్, రూ.10 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించినం’’అని తెలిపారు.