టూరిజం ప్రమోషనే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి జూపల్లి

టూరిజం ప్రమోషనే  ప్రభుత్వ లక్ష్యం : మంత్రి జూపల్లి
  • తక్కువ ఖర్చుతో ప్రపంచవ్యాప్తంగా ప్రచారం: మంత్రి జూపల్లి
  • గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారానికే రూ.120 కోట్లు ఖర్చు చేసింది

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ టూరిజాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రమోషన్ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశామన్నారు. సెక్రటేరియెట్‌‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మిస్ వరల్డ్ పోటీలపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్ పాలనలో టూరిజం ప్రమోషన్లకే సుమారు రూ.120 కోట్లకు పైగా ఖర్చు చేశారని తెలిపారు. 

ఇన్ని కోట్లు ఖర్చు చేసి మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని నిలదీశారు. బీఆర్ఎస్ చేసిన ఖర్చుపై చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు. తెలంగాణ పర్యాటక ప్రమోషన్, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించడమే లక్ష్యంగా నిర్వహించిన మిస్ వరల్డ్–2025 పోటీలు విజయవంతమయ్యాయని తెలిపారు. పర్యాటకం, హస్తకళలు, చేనేత ఉత్పత్తులకు మంచి ప్రమోషన్ లభించిందని, మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లను ప్రపంచానికి పరిచయం చేశామన్నారు. పోటీలతో పర్యాటక ప్రాంతాలు, కట్టడాలు, ప్రపంచం దృష్టిని ఆకర్షించాయన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ టూరిజం ప్రమోషన్ చేశామన్నారు. 

ఒక్కో దేశంలో రెండు, మూడు రోజులు స్టాల్స్ ఏర్పాటు చేసి టూరిజం ప్రచారం చేయాలంటే కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని, కనీసం రూ.2 నుంచి రూ.3 కోట్ల వరకు అవుతుందని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని, అవసరమైతే పీపీపీ మోడల్ పూర్తి చేస్తామన్నారు. సీజన్ల ప్రకారం అవసరమైతే దేశ, విదేశీ పర్యటకులను ఆకర్షించేందుకు రాయితీలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతోనే టూరిజం కొత్త పాలసీ తీసుకొచ్చామని వెల్లడించారు. టెంపుల్ టూరిజం దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.