
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఆస్తులు కాకుండా బీఆర్ఎస్ నేతల ఆస్తులు ఎంత పెరిగాయో చెప్పాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జె.రామచందర్ నాయక్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతల వ్యవహారం చూస్తే దయ్యాలే వేదాలు వల్లిస్తున్నట్లు ఉందని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలను కాలరాశారని ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా, నిరుద్యోగుల రాష్ట్రంగా, మహిళలపై అఘాయిత్యాల రాష్ట్రంగా, తాగుబోతుల మార్చారని మండిపడ్డారు. దళితుడిని సీఎం చేస్తామని రాత్రికి రాత్రే ర్తరఫ్ చేశారని గుర్తుచేశారు. ప్రజలను కేసీఆర్ కన్విన్స్ చేయలేక కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమానికి తెరలేపారని అన్నారు.
‘‘ధరణి పేరుతో రైతు భూములను ఆక్రమించారు. వృద్ధాప్య పెన్షన్లు తీసేశారు. నిరుద్యోగ యువతను మోసం చేశారు. పరవస్తు చిన్నయ్యసూరి చెప్పినట్లు కొంగజపం చేసి ఒక్కొక్క చేపను మింగినట్లు విద్యార్థులను, అన్ని సామాజికవర్గాల వారిని కేసీఆర్ మింగారు. సమైక్య రాష్ట్రంలో 684 బార్లు, 2,216 మద్యం దుకాణాలు ఉంటే స్వరాష్ట్రంలో వాటిని 1,180 బార్లు, 2,620 మద్యం దుకాణాలకు పెంచారు. ఏ కిరాణా షాపుకు వెళ్లినా మద్యం దొరికే పరిస్థితికి తీసుకువచ్చారు’’ అని రామచందర్ వ్యాఖ్యానించారు. 116 జీఓ ద్వారా నీరా కేఫ్ను హుస్సేన్ సాగర్– నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసి వారి బంధువులను అప్పగించారని తెలిపారు. అలాగే ఎక్సైజ్ సిబ్బందికి ప్రమోషన్లు ఇచ్చి పోస్టింగులు ఇవ్వలేదని విమర్శించారు. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ అనేక శాఖలను తన దగ్గర పెట్టుకుని నయా ఖాసీం రిజ్వీలా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు.