
భద్రాచలం, వెలుగు: చత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా గంగులూరు అడవుల్లో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. గంగులూరు పోలీస్స్టేషన్ సమీప అడవుల్లో మావోయిస్టుల సంచారం గురించి సమాచారం రావడంతో ఎస్పీ జితేంద్రయాదవ్.. డీఆర్జీ బలగాలను రంగంలోకి దించి మావోయిస్టుల కదలికలపై అన్వేషణ సాగించారు.
ఈ క్రమంలో మావోయిస్టు దళం భద్రతా బలగాల రాకను గుర్తించి కాల్పులకు దిగింది. ఇరువర్గాల మధ్య కొంతసేపు కాల్పులు జరిగాయి. ఆ తర్వాత మావోయిస్టులు కాల్పులు జరుపుకుంటూ అడవుల్లోకి వెళ్లారు. అనంతరం ఘటనా స్థలంలో భద్రతా దళాలుఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించాయి. అలాగే, 303 రైఫిల్స్, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు.