పద్మారావునగర్, వెలుగు: రైళ్లలో ప్రయాణికుల బ్యాగుల జిప్పులురహస్యంగా తెరిచి బంగారు నగలు, నగదు దోచుకుంటున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్కు చెందిన ఇద్దరిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.25 లక్షల విలువైన 210 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు.
సికింద్రాబాద్ లో రైల్వే డీఎస్పీ జావెద్, ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ తో కలసి మీడియాకు వివరాలు వెల్లడించారు. బెంగళూరుకు చెందిన కోకిల మణిరాజు (39) అనే మహిళ, తమిళనాడు వెల్లూర్ జిల్లా జోలార్పేటకు చెందిన ఎస్.దినా (27) అనే యువకుడు కలసి నాందేడ్ ఎక్స్ ప్రెస్లో మహిళా ప్రయాణికుల బ్యాగుల నుంచి నగలు దొంగిలించి చర్లపల్లిలో దిగినట్లు పోలీసులు గుర్తించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు గురువారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వీరిని పట్టుకున్నారు. నేరం అంగీకరించడంతో బంగారు నగలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని ఐజీ రమేశ్ నాయుడు అభినందించి రివార్డులు ప్రకటించారు.
