హైదరాబాద్, వెలుగు: ‘బీసీల ఐక్యతే బలంగా, అధికారమే లక్ష్యంగా’ అనే నినాదంతో ఈ నెల 28న హైదరాబాద్ వనస్థలిపురం ఉన్న డీర్ పార్క్లో బీసీ వన భోజనాల మహోత్సవాన్ని నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
గురువారం హైదరాబాద్లోనిబీసీ భవన్లో బీసీ వన భోజనాల మహోత్సవం బ్రోచర్ను బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ వన బోజనాల నిర్వహణ కమిటీ సభ్యులు చామకూర రాజు, కేవీ గౌడ్, రఘురాం నేతలతో కలిసి జాజుల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీలు గత 80 ఏండ్లుగా రాజకీయ అధికారాన్ని అందుకోలేకపోతున్నారన్నారు. విడివిడిగా ఉన్న బీసీ కులాల్లో చైతన్యం.. సంఘటితంగా ఆశించిన స్థాయిలో రావడం లేదని పేర్కొన్నారు.
బీసీల సాంస్కృతిక జీవన విధానం అంతా ఒకటేనని, బీసీల్లో ఉన్న బీసీ కులాలు, కులాలుగా తాము సంఘటితమవుతూనే, బలపడడానికి ఈ వన భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మహోత్సవాలకు రాష్ట్రంలోని బీసీలందరూ రాజకీయ పార్టీలకతీతంగా కుటుంబ సమేతంగా హాజరై బీసీల ఐక్యతను చాటి చెప్పాలని జాజుల పిలుపునిచ్చారు.
