రక్షణ కల్పించాల్సిన పోలీసులే దొంగలుగా మారిన ఘటన ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్లో జరిగింది. ఓ మొబైల్ షోరూమ్లోకి వెళ్లి అత్యంత ఖరీదైన ఐఫోన్ను దొంగిలించిన ఇద్దరు పోలీసుల బండారం సీసీటీవీ కెమెరాల్లో బయటపడింది.
సమాచారం ప్రకారం ఎం జరిగిందంటే :
జౌన్పూర్లోని లైన్ బజార్లో ఉన్న ఒక మొబైల్ షోరూమ్కు మిథిలేష్ యాదవ్, ధనంజయ్ బింద్ అనే ఇద్దరు పోలీసులు యూనిఫాంలోనే వెళ్లారు. అత్యంత ఖరీదైన ఫోన్ చూపించమని యజమానిని అడిగారు.
షాపులో ఉన్న మహిళా డిస్ప్లేలో ఉన్న ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఫోన్లు చూపిస్తుండగా, ఒక పోలీస్ అతని దగ్గర ఉన్న పాత ఐఫోన్ను తీసి దానితో మార్చేసి కొత్త ఫోన్ను ఎం తెలియనట్టే జేబులో వేసుకున్నాడు.
ఈ పని చేస్తున్నప్పుడు ఆ ఇద్దరు పోలీసులు ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకోవడం సీసీటీవీలో స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత ఎం మాట్లాడకుండానే అక్కడి నుండి జారుకున్నారు.
ఎలా బయటపడిందంటే :
షాపులో ఉన్న మహిళా రాత్రి స్టాక్ చెక్ చేసుకుంటుండగా ఒక ఫోన్ తక్కువగా ఉందని గుర్తించింది. వెంటనే సీసీటీవీ ఫుటేజీని చెక్ చేయగా, పోలీసులు చేసిన ఈ ఘరానా దొంగతనం వెలుగులోకి వచ్చింది.
►ALSO READ | 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు లైన్ క్లియర్.. రూ.3లక్షల 25వేల కోట్ల మెగా డీల్
షోరూమ్ ఓనర్ సత్యం సోషల్ మీడియాలో ఈ దొంగతన్నాన్నీ చెప్పుకొచ్చాడు. మేము కష్టపడి 12 గంటలు పని చేస్తుంటే.. రక్షణ ఇవ్వాల్సిన పోలీసులే సిగ్గు లేకుండా నవ్వుకుంటూ ఇలా దొంగతనం చేస్తారా? అని ఆవేదన వ్యక్తం చేసాడు.
ఈ విషయం ఉన్నతాధికారుల వరకు వెళ్లడంతో ఆ ఇద్దరు పోలీసులను పిలిపించి ఇఫోన్ని తిరిగి ఇప్పించారు. ప్రస్తుతం ఆ ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసి, వారిపై విచారణకు ఆదేశించారు.
