- ఆరేండ్లలో 46 శాతం పనులే పూర్తి
- 2026 అక్టోబర్ వరకు గడువు ఇచ్చినా కదలికలేదు
- దుమ్ము, ధూళితో జనం పాట్లు
- బ్యాంకు అప్పులు చెల్లించలేక కాంట్రాక్ట్ సంస్థ దివాళా తీసినట్లు ప్రచారం
హైదరాబాద్, వెలుగు: ఉప్పల్ నుంచి వరంగల్ వైపు వెళ్లే రహదారి ప్రయాణికుల ఓపికకు పరీక్ష పెడుతున్నది. రోడ్డంతా పాత్ హోల్స్తో నిండిపోయాయి. ప్రతీ రోజు వెలువడే దుమ్ము, ధూళితో ప్రజలు నరకం చూస్తున్నారు. తరచూ రోడ్డు ప్రమాదాలకు గురై ఇప్పటికే పలువురు మరణించారు. చాలా మంది గాయపడ్డారు. ట్రాఫిక్ అంతరాయాన్ని నిర్మూలించడానికి 2018లో రూ.425 కోట్లతో చేపట్టిన ఉప్పల్ ఫ్లై ఓవర్ పనులు ఏడేండ్లవుతున్నా ఇంకా పూర్తికాలేదు. గత సర్కారు హయాంలో 2020లోనే కంప్లీట్ చేయాల్సిన పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
గడిచిన ఆరేండ్లలో కేవలం 46 శాతం వర్క్స్ మాత్రమే కంప్లీట్ అయ్యాయి. నారపల్లి నుంచి ఉప్పల్కు చేరుకోవడానికి కనీసం గంట సమయమైనా పడుతోంది. పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ బ్యాంకు అప్పులు చెల్లించలేక దివాళా తీసినట్టుగా ప్రచారం జరుగుతోంది. కొత్త టెండర్లు పిలిస్తే ప్రభుత్వంపై రూ.200 కోట్ల భారం పడనుంది. దీంతో ఆదే కాంట్రాక్ట్ సంస్థతో పనులు చేయించడానికి 2026 అక్టోబర్ వరకు గడువిచ్చారు.
6.25 కి.మీ దూరం నిర్మించాలి
హైదరాబాద్–భూపాలపట్నం నేషనల్ హైవే 163 పై ఉప్పల్ నుంచి నారపల్లి మధ్యన గల 7.95 కి.మీ నుంచి 14.2 కి.మీ మధ్య మొత్తం 6.25 కి.మీ దూరం ఆరు లేన్ల ఫ్లై ఓవర్ రోడ్డు నిర్మాణానికి గత ప్రభుత్వం వర్క్ ప్రపోజల్ చేసింది. రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ పరిధిలోని నేషనల్ హైవే విభాగం టెండర్లు పిలిచింది. ప్రాజెక్ట్ కాస్ట్ రూ.626.76 కోట్లు కాగా గాయత్రి, ఓజోఎస్సీ సిబ్మోస్ట్ కంపెనీలు జాయింట్ వెంచర్లో పనులు దక్కించుకున్నాయి. 2018 జులై 2 న వర్క్స్ స్టార్ట్ చేశారు. జులై 2020 వరకు వర్క్ కంప్లీట్ చేస్తామని గడువిచ్చారు. గత సర్కారు వైఫల్యం కారణంగా పనులు చాలా స్లోగా జరిగాయి. దీంతో మరో రెండేండ్ల గడువు పెంచారు. నాలుగేండ్లు గడిచినా కూడా 46 శాతం వర్క్ మాత్రమే కంప్లీట్ చేశారు.
కాంట్రాక్ట్ సంస్థకు రూ.198 కోట్ల బిల్స్ చెల్లించారు. మధ్యలో కాంట్రాక్ట్ సంస్థ బ్యాంకు అప్పులు చెల్లించలేక దివాళా తీసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. కాంట్రాక్ట్ సంస్థ సైతం పనులు చేయలేమని ఎన్హెచ్ అధికారులకు లేఖలు రాసింది. ఎన్సీఎల్టీ సంస్థకు సబ్ కాంట్రాక్ట్పై పనులు అప్పగిస్తామని కోరింది.
2026 అక్టోబర్ వరకు గడువు పెంపు
ఉప్పల్ ఫ్లై ఓవర్ పెండింగ్ పనులకు సంబంధించి కాంట్రాక్ట్ సంస్థను తొలగించి కొత్తగా టెండర్లు పిలిస్తే ఇప్పుడున్న రేట్ల ప్రకారం ప్రభుత్వంపై రూ.200 కోట్ల అదనపు భారం పడుతుందని ఎన్హెచ్ ఇంజినీర్లు చెబుతున్నారు. దీంతో కాంట్రాక్ట్ సంస్థతోటే పనులు చేయించడానికి ఆ సంస్థపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో గత కొద్ది రోజులుగా పనులు మొదలయ్యాయి. అనుకున్నంత వేగవంతంగా మాత్రం జరగట్లేదు. దీంతో ఇంకా 50 శాతానికి పైగా పనులు కేవలం 11 నెలల్లో కంప్లీట్ చేస్తారా? అనే అనుమానాలను ప్రజలు వ్యక్త పరుస్తున్నారు.
ట్రాఫిక్ కష్టాలు, దుమ్ము ధూళితో ఇబ్బందులు
హైదరాబాద్-వరంగల్ హైవే రోడ్డుపై నిత్యం 60 వేలకు పైగా వెహికల్స్ ప్రయాణిస్తుంటాయి. నగరంలోనే అతి పెద్ద ట్రాఫిక్ ఉండే ప్రాంతం ఇది. ఉప్పల్ జంక్షన్ నుంచి నారపల్లి వరకు వరంగల్, యాదాద్రి భువనగిరి, తూర్పు హైదరాబాద్ వైపు ట్రాఫిక్ను తగ్గించడానికి ఈ ఎలివేటేడ్ కారిడార్ రూపొందించారు. పీవీఎన్ఆర్ఎక్స్ప్రెస్ వే తర్వాత హైదరాబాద్ నగరంలో అతి పొడవైన ఫ్లై ఓవర్ ఇదే. ఎలివేటేడ్ కారిడార్కు సంబంధించిన పియర్స్నిర్మాణంతో వెహికల్స్రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
పనుల ఆలస్యం కారణంగా పాత్ హోల్స్ ఏర్పడ్డాయి. నిత్యం, దుమ్ము ధూళి, ట్రాఫిక్ డైవర్షన్ల కారణంగా ఈ ప్రాంతం ఆక్సిడెంట్ ప్రోన్ ఏరియాగా మారింది. రోడ్డు ప్రమాదాలు జరిగి ఇప్పటికే పలువురు మరణించగా.. చాలా మంది గాయపడినట్టుగా పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. కాగా, ఉప్పల్ఫ్లై ఓవర్ సమస్యలపై స్థానికులు ఫేస్బుక్, ట్విట్టర్, ఎక్స్ ఖాతాలలో వందల సంఖ్యలో పోస్టులు పెట్టారు. సోషల్ మీడియాలో రీల్స్ చేసి వైరల్ చేస్తున్నారు.
నిత్యం నరకం అనుభవిస్తున్నం..
ఉప్పల్ ఏరియాలో దుమ్ము, ధూళితో నరకం అనుభవిస్తున్నం. చిన్న పిల్లలు, వృద్ధులు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఏడేండ్లవుతున్నా పనులు కంప్లీట్ చేయడం లేదు. త్వరగా పనులు పూర్తి చేయించాలి. - తండా సమ్మయ్య, బోడుప్పల్
పనులు స్పీడప్ చేస్తున్నం
ఉప్పల్ఎలివేటెడ్ కారిడార్ పనులను కాంట్రాక్ట్ సంస్థ రీ స్టార్ట్ చేసింది. పనులుస్పీడప్ చేస్తున్నం. ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తున్నం. గడువులోగా (2026 అక్టోబర్) పనులు కంప్లీట్ చేసేలా చర్యలు తీసుకుంటున్నం. - జయభారతి, ఇన్చార్జీ సీఈ, ఆర్ అండ్ బీ శాఖ ఎన్ హెచ్ విభాగం, హైదరాబాద్
యాక్సిడెంట్లు జరుగుతున్నయ్
ఉప్పల్ ఫ్లై ఓవర్ పనులు ఏడేండ్లుగా చేస్తున్నారు. రోడ్డుకు రెండు వైపులా పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. ప్రతీ రోజు ట్రాఫిక్ డైవర్షన్లు పెట్టడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేక మంది తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. – సాయి వర్ధన్, ఉప్పల్

