బీజేపీ మాజీ నేత కొడుకుకు జీవిత ఖైదు..ఉత్తరాఖండ్​లో రిసార్ట్ రిసెప్షనిస్ట్ హత్య కేసులో తీర్పు

బీజేపీ మాజీ నేత కొడుకుకు జీవిత ఖైదు..ఉత్తరాఖండ్​లో రిసార్ట్ రిసెప్షనిస్ట్ హత్య కేసులో తీర్పు
  • 2022 లో హత్యకు గురైన రిసెప్షనిస్ట్ అంకిత భండారి
  • వీఐపీలకు ‘స్పెషల్ సర్వీస్’  నిరాకరించడంతో హత్య 

ఉత్తరాఖండ్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంకిత భండారి హత్య కేసులో ఉత్తరాఖండ్​కు చెందిన బీజేపీ మాజీ నేత కొడుకు పుల్కిత్​ ఆర్య, మరో ఇద్దరికి పౌరి గర్హ్వాల్ జిల్లా కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. ఉత్తరాఖండ్ పౌరి గర్హ్వాల్ జిల్లా దోబ్ శ్రీకోట్​కు చెందిన 19 ఏండ్ల అంకిత భండారి.. యమకేశ్వర్ ఏరియాలోని వనంతార రిసార్ట్​లో 2022 ఆగస్టులో రిసెప్షనిస్ట్​గా చేరింది. ఈ రిసార్ట్ బీజేపీ మాజీ నేత వినోద్ ఆర్యా కొడుకు పుల్కిత్ ఆర్యది. 

సెప్టెంబర్ 18న పుల్కిత్ ఆర్యా, మేనేజర్ సౌరభ్ భాస్కర్, మరో ఎంప్లాయ్ అంకిత్ గుప్తాతో కలిసి అంకిత భండారి రుషికేశ్ వెళ్లింది. రిటర్న్ జర్నీలో రాత్రి 8 గంటలప్పుడు వీళ్లు చిలా రోడ్​లోని కెనాల్ వద్ద ఆగారు. పుల్కిత్, సౌరభ్, అంకిత్ మద్యం తాగారు. ఆపై తన కోరిక తీర్చాలని అంకితను పుల్కిత్ బలవంతం చేశాడు. రిసార్ట్​కు వచ్చే వీఐపీలకు స్పెషల్ సర్వీస్​ అందించాలని ఒత్తిడి చేశాడు. దీనికి నిరాకరించిన అంకిత.. రిసార్ట్​లో జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి బయటపెడ్తానని బెదిరించింది. దీంతో ముగ్గురూ కలిసి అంకితను కెనాల్​లో తోసేశారు. మూడ్రోజుల తర్వాత ఆమె డెడ్​బాడీ బయటపడింది.

రెండేండ్ల పాటు సిట్ దర్యాప్తు..

అంకిత హత్య వెనుక వినోద్ ఆర్యా, అతని కొడుకు పుల్కిత్ ఆర్యా ఉన్నారని, వాళ్లను కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరిగాయి. పోస్టుమార్టం రిపోర్ట్​లో అంకితపై ఎలాంటి అత్యాచారం జరగలేదని తేలింది. ప్రజలు ఆందోళన చేయడంతో బీజేపీ హైకమాండ్ వినోద్ ఆర్యాను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ప్రభుత్వం సిట్ ఏర్పాటుచేసి దర్యాప్తు జరిపించింది. 

రెండున్నరేండ్ల పాటు దర్యాప్తు జరిపిన సిట్​.. 500 పేజీల చార్జ్​షీట్​ను కోర్టుకు సమర్పించింది. దీని ఆధారంగా పుల్కిత్ ఆర్య, సౌరభ్, అంకిత్ ను జిల్లా సెషన్ కోర్టు దోషులుగా తేల్చింది. తాజాగా ముగ్గురికీ జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.50వేల ఫైన్​ విధించింది.  అయితే, నిందితులకు ఉరి శిక్ష విధించాలని అంకిత భండారి పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.