
- 2022 లో హత్యకు గురైన రిసెప్షనిస్ట్ అంకిత భండారి
- వీఐపీలకు ‘స్పెషల్ సర్వీస్’ నిరాకరించడంతో హత్య
ఉత్తరాఖండ్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంకిత భండారి హత్య కేసులో ఉత్తరాఖండ్కు చెందిన బీజేపీ మాజీ నేత కొడుకు పుల్కిత్ ఆర్య, మరో ఇద్దరికి పౌరి గర్హ్వాల్ జిల్లా కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. ఉత్తరాఖండ్ పౌరి గర్హ్వాల్ జిల్లా దోబ్ శ్రీకోట్కు చెందిన 19 ఏండ్ల అంకిత భండారి.. యమకేశ్వర్ ఏరియాలోని వనంతార రిసార్ట్లో 2022 ఆగస్టులో రిసెప్షనిస్ట్గా చేరింది. ఈ రిసార్ట్ బీజేపీ మాజీ నేత వినోద్ ఆర్యా కొడుకు పుల్కిత్ ఆర్యది.
సెప్టెంబర్ 18న పుల్కిత్ ఆర్యా, మేనేజర్ సౌరభ్ భాస్కర్, మరో ఎంప్లాయ్ అంకిత్ గుప్తాతో కలిసి అంకిత భండారి రుషికేశ్ వెళ్లింది. రిటర్న్ జర్నీలో రాత్రి 8 గంటలప్పుడు వీళ్లు చిలా రోడ్లోని కెనాల్ వద్ద ఆగారు. పుల్కిత్, సౌరభ్, అంకిత్ మద్యం తాగారు. ఆపై తన కోరిక తీర్చాలని అంకితను పుల్కిత్ బలవంతం చేశాడు. రిసార్ట్కు వచ్చే వీఐపీలకు స్పెషల్ సర్వీస్ అందించాలని ఒత్తిడి చేశాడు. దీనికి నిరాకరించిన అంకిత.. రిసార్ట్లో జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి బయటపెడ్తానని బెదిరించింది. దీంతో ముగ్గురూ కలిసి అంకితను కెనాల్లో తోసేశారు. మూడ్రోజుల తర్వాత ఆమె డెడ్బాడీ బయటపడింది.
రెండేండ్ల పాటు సిట్ దర్యాప్తు..
అంకిత హత్య వెనుక వినోద్ ఆర్యా, అతని కొడుకు పుల్కిత్ ఆర్యా ఉన్నారని, వాళ్లను కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరిగాయి. పోస్టుమార్టం రిపోర్ట్లో అంకితపై ఎలాంటి అత్యాచారం జరగలేదని తేలింది. ప్రజలు ఆందోళన చేయడంతో బీజేపీ హైకమాండ్ వినోద్ ఆర్యాను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ప్రభుత్వం సిట్ ఏర్పాటుచేసి దర్యాప్తు జరిపించింది.
రెండున్నరేండ్ల పాటు దర్యాప్తు జరిపిన సిట్.. 500 పేజీల చార్జ్షీట్ను కోర్టుకు సమర్పించింది. దీని ఆధారంగా పుల్కిత్ ఆర్య, సౌరభ్, అంకిత్ ను జిల్లా సెషన్ కోర్టు దోషులుగా తేల్చింది. తాజాగా ముగ్గురికీ జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.50వేల ఫైన్ విధించింది. అయితే, నిందితులకు ఉరి శిక్ష విధించాలని అంకిత భండారి పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.