ఇన్విజిలేటర్​ కొట్టాడని.. రైలు కింద పడి విద్యార్థి ఆత్మహత్య

ఇన్విజిలేటర్​ కొట్టాడని..  రైలు కింద పడి విద్యార్థి ఆత్మహత్య

నర్సంపేట, వెలుగు : రైలు కింద పడి ఓ స్టూడెంట్​సూసైడ్​ చేసుకోగా.. కాలేజ్​యజమాన్యం, ఇన్విజిలేటరే కారణమని ఆరోపిస్తూ మృతుడి కుటుంబసభ్యులు డెడ్​బాడీతో ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. వరంగల్​జిల్లా ఖానాపురం మండలం రాగంపేటకు చెందిన భూక్య సాయికుమార్​(22) నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదువుతున్నాడు. సెకండియర్​లో ఫెయిల్​కావడంతో బాలాజీ మహిళా డిగ్రీ అండ్​ పీజీ కాలేజ్​లో సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నాడు. బుధవారం కాపీయింగ్​చేస్తుండగా ఓ ఇన్విజిలేటర్​ కొట్టాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.

కలత చెందిన సాయికుమార్​ గురువారం సాయంత్రం గీసుగొండ మండలం వంచనగిరి సమీపంలో గూడ్స్​ రైలు​కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికుమార్​ కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు వరంగల్​ ఎంజీఎంకు వెళ్లి డెడ్​బాడీకి పోస్టుమార్టం చేయించాక నర్సంపేటకు తీసుకొచ్చారు. నేరుగా బాలాజీ కాలేజ్​గేట్​ఎదుట డెడ్​బాడీ పెట్టి  ధర్నాకు దిగారు. కాలేజీ లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో కమీషనరేట్​పరిధిలోని పలు పోలీస్​స్టేషన్ల నుంచి బలగాలను రప్పించి మోహరించారు. ఈ క్రమంలో పోలీసులు..మృతుడి కుటుంబ సభ్యులను, కాలేజీ​యాజమాన్యాన్ని కలిసి మాట్లాడుకోవాలని చెప్పారు. చివరికి రూ.30 వేల పరిహారం ఇవ్వడంతో ఆందోళన విరమించి వెళ్లిపోయారు.