గతంలో రేడియో జాకీ (RJ)గా పనిచేసిన ముంబైకి చెందిన మనీషా ప్రసాద్ (48) అనే మహిళ బెంగళూరులో ఆత్మహత్య చేసుకుంది. తన ప్రియుడి వేధింపులు తట్టుకోలేకే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన బెంగళూరులోని అమృతహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
మనీషా రాసిన సూసైడ్ నోట్.. ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా... పోలీసులు ఆమె ప్రియుడు హర్షవర్ధన్ సింగ్ బన్సల్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
అసలేం జరిగింది?
మనీషా కొద్దిరోజుల క్రితమే ముంబై నుంచి బెంగళూరుకు వచ్చారు. అక్కడ మన్యతా టెక్ పార్క్ దగ్గరలో ఉన్న ఒక అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉండడానికి ఒక ఫ్లాట్ కొనుగోలు చేసింది. అలాగే ముంబై నుంచి ఆమె సామాన్లను కూడా షిఫ్ట్ చేసుకుంది.
ఈ విషయం బయటపడింది. మనీషా ఫోన్ చేస్తుంటే ఎత్తకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి... మే 23న వారు ఆమె ఫ్లాట్కు వచ్చి చూసేసరికి ఆమె ప్రాణాల్లేకుండా పడి ఉంది .
విడాకులు.. తరువాత సహజీవనం
పోలీసుల వివరాల ప్రకారం... మనీషాకు కుటుంబ గొడవల వల్ల 2024లోనే భర్తతో విడాకులయ్యాయి. ఆ తర్వాత ఆమెకు ముంబైలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసే హర్షవర్ధన్ సింగ్తో పరిచయం ఏర్పడింది. హిమాచల్ ప్రదేశ్కు చెందిన అతడితో ఆమె కొంతకాలం పాటు సహజీవనం చేసింది.
సూసైడ్ లెటర్లో ఏముందంటే
ఆత్మహత్య చేసుకోవడానికి ముందు మనీషా మూడు పేజీల సూసైడ్ లెటర్ రాసింది. గత కొన్ని సంవత్సరాలుగా హర్షవర్ధన్ నన్ను తీవ్రమైన మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడు. ఆ బాధను, ఒత్తిడిని నేను ఇక భరించలేకపోతున్నాను అని ఆమె లేఖలో ఆవేదన వ్యక్తం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు.
