ప్రజా సమస్యలపై పోరాడటం షర్మిల చేసిన తప్పా : వైఎస్ విజయమ్మ

 ప్రజా సమస్యలపై పోరాడటం షర్మిల చేసిన తప్పా : వైఎస్ విజయమ్మ

పాలేరు తెలంగాణను పాలించే ఊరు అవుతుందని వైఎస్ విజయమ్మ అన్నారు. ఖమ్మం జిల్లా అంటే షర్మిల నాయకత్వంలో త్వరలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి గుమ్మం అవుతుందని ఆకాంక్షించారు. పాలేరు ఇక నుంచి అభివృద్ధికి, సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ అవుతుందని చెప్పారు. పాలేరులో YSR తెలంగాణ పార్టీ మరో ముందడుగు వేసిందన్నారు. పార్టీ కార్యాలయ నిర్మాణానికి చేసిన  భూమి పూజ తెలంగాణ ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు నాంది అని తెలిపారు. తెలంగాణలో వెనుబడిన వర్గాల బాగు కోసం, నిరాదరణకు గురైన వర్గాల బాగు కోసం తొలిమెట్టు అని వెల్లడించారు. ప్రజలకు మంచి చేయాలని, వారి జీవితాలు బాగు చేయాలని గొప్ప సంకల్పంతో షర్మిలమ్మ ముందుకెళ్తోందన్నారు.  ఖమ్మం జిల్లా పాలేరులో వైఎస్సార్ తెలంగాణ  పార్టీ కార్యాలయ నిర్మాణానికి వైఎస్ షర్మిలతో కలిసి వైఎస్ విజయమ్మ శంకుస్థాపన చేశారు. 

తెలంగాణ బొబ్బిలి షర్మిల

వైఎస్ షర్మిల తెలంగాణ బొబ్బిలి అని వైఎస్ విజయమ్మ అన్నారు. ప్రజల కోసం పాద యాత్ర చేస్తే తెలంగాణ ప్రభుత్వం షర్మిలను అడ్డుకునే ప్రయత్నం చేసిందని చెప్పారు. బస్సులు, వాహనాలు తగలబెట్టినా..మొక్కవోని దీక్షతో షర్మిల ముందుకెళ్తోందన్నారు. అరెస్టులు చేసినా...పోలీస్ స్టేషన్ లో గంటలు గంటలు నిర్భంధించినా సహనంతో భరించిందన్నారు. ప్రజలకు సేవ చేయాలనుకోవడం, ప్రజా సమస్యలపై పోరాడటం షర్మిల చేసిన తప్పా అని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇవ్వమని అడిగితే లాఠీ చార్జ్ చేశారని చెప్పారు. రైతులను కాపాడు దొరా అని అంటే అరెస్ట్ చేశారన్నారు. ప్రజల బాధలను తీర్చండని అడిగితే కొట్టి, తిట్టి, ఈడ్డుకెళ్లారున్నారు. ఎన్ని చేసినా వైఎస్ రక్తం దేనికి భయపడదన్నారు. ఎన్ని నిర్బంధాలు సృష్టించినా..అరెస్టులు చేసినా..ప్రజల నుంచి..తెలంగాణ నుంచి షర్మిలను వేరుచేయలేరన్నారు. షర్మిల నమ్మిన సంక్షేమం, సమన్యాయం, స్వయం సమృద్ధి ప్రజలకు అందిస్తుందని చెప్పారు.