CBSE 12వ తరగతి పరీక్షల్లో కీలక మార్పు: ఇకపై ఆన్‌లైన్‌లోనే పేపర్ల కరెక్షన్.. విద్యార్థుల ఆగ్రహం..

CBSE 12వ తరగతి పరీక్షల్లో కీలక మార్పు: ఇకపై ఆన్‌లైన్‌లోనే పేపర్ల కరెక్షన్.. విద్యార్థుల ఆగ్రహం..

సీబీఎస్ఈ (CBSE) 12వ తరగతి బోర్డు పరీక్షల మూల్యాంకన విధానంలో కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుండి 12వ తరగతి విద్యార్థుల జవాబు పత్రాలను (Answer Sheets) టీచర్లు నేరుగా కాకుండా, కంప్యూటర్ స్క్రీన్‌పై చూస్తూ దిద్దుతారు. దీనిని ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) అని పిలుస్తారు. అంటే మీ పేపర్లను స్కాన్ చేసి కంప్యూటర్‌లోకి ఎక్కిస్తారు, టీచర్లు అక్కడే మార్కులు వేస్తారు. 10వ తరగతికి మాత్రం ప్రస్తుతానికి పాత పద్ధతే ఉంటుంది.

విద్యార్థుల ఆందోళన:
పరీక్షలు మొదలవ్వడానికి కేవలం మూడు రోజుల ముందు ఈ ప్రకటన చేయడంపై విద్యార్థులు కలవరపడుతున్నారు. ఆన్సర్ షిట్  చివరలో మ్యాప్‌లు కచ్చితంగా జత చేయాలని, ప్రశ్నల క్రమాన్ని సరిగ్గా పాటించాలని బోర్డు చెబుతోంది. ఒకవేళ ఆర్డర్ తప్పితే కంప్యూటర్ స్కాన్ చేయడంలో ఇబ్బంది అవుతుందేమోనని విద్యార్థులు భయపడుతున్నారు. ఒకవేళ పేపర్ సరిగ్గా స్కాన్ అవ్వకపోతే మార్కులు తగ్గుతాయేమో అన్నది వారి సందేహం.

టీచర్ల అభిప్రాయం:
పేపర్లను చేత్తో దిద్దేటప్పుడు జరిగే మార్కుల లెక్కింపు తప్పులు ఇకపై జరగవు. దీనివల్ల రీ-వాల్యుయేషన్ అవసరం తగ్గుతుంది. అంతేకాక ఇంటర్నెట్ సరిగ్గా లేకపోతే లేదా కరెంట్ పోతే పేపర్లు దిద్దడం కష్టమవుతుందని, కంప్యూటర్ స్క్రీన్‌ను ఎక్కువ సేపు చూడటం వల్ల కళ్లపై ఒత్తిడి పడుతుందని కొందరు టీచర్లు చెబుతున్నారు.

పరీక్షల కంట్రోలర్ సన్యామ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ఈ పద్ధతి వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని, దీనికోసం ఇప్పటికే తగిన శిక్షణ ఇచ్చామని చెప్పారు. విదేశాల్లో ఉన్న స్కూళ్లలో  కూడా దీనిని పరీక్షించి చూశామని, చాల  సురక్షితమైన పద్ధతి అని భరోసా ఇచ్చారు.