
- సంస్థ కార్యాలయం ఎదుట బాధితుల ఆందోళన
నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ పట్టణంలో ఏర్పాటు చేసిన యూనిక్ స్వయం మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ లిమిటెడ్ సంస్థ డిపాజిట్ల రూపంలో రూ.10 కోట్లు వసూలు చేసి మోసం చేసింది. గడువు ముగిసినా తాము డిపాజిట్ చేసిన సొమ్మును తిరిగి ఇవ్వకుండా నిర్వాహకులు మోసం చేశారని ఆరోపిస్తూ సోమవారం పలువురు బాధితులు నల్గొండలోని సంస్థ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు.
తమ సంస్థలో డబ్బులు డిపాజిట్ చేస్తే ఆరున్నరేండ్లలో రెట్టింపు డబ్బులు ఇస్తామని, పదేండ్లు డిపాజిట్ చేస్తే మూడింతల డబ్బులు ఇస్తామని ఏజెంట్ల ద్వారా డబ్బులు వసూలు చేశారని బాధితులు తెలిపారు. మొదట్లో కొంత మందికి డబ్బులు చెల్లించి, ఏజెంట్ల ద్వారా డిపాజిట్లు సేకరించారని వాపోయారు.
నార్కెట్ పల్లి, మాడుగులపల్లి, తిప్పర్తి మండలాలకు చెందిన వెయ్యి మంది నుంచి డబ్బులు వసూలు చేశారని పేర్కొన్నారు. ఈ విషయంపై ఎస్పీ శరత్ చంద్ర పవార్ కు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు తెలిపారు.