సామాన్యులకు జనరిక్ ఔషధాలను అందుబాటులోకి తీసుకురావడానికి 2024 మార్చి నాటికి మరో 10వేల ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలను (పీఎంబీజేకే) ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా జులై 21న లోక్సభలో తెలిపారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 9,512 కేంద్రాలు ఓపెన్ చేసినట్లు వెల్లడించారు.
ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నిబంధనలు– 2002 ప్రకారం.. ప్రతి వైద్యుడు జనరిక్ మందుల పేర్లు స్పష్టంగా, క్యాపిటల్ లెటర్స్లో రాయాలని సూచించినట్లు చెప్పారు. ఆయన లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాల్ని వెల్లడించారు. డైరైక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కేంద్రం ఆధ్వర్యంలో నడిచే అన్ని హాస్పిటల్లు, వెల్నెస్ సెంటర్లకు ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు.
జాతీయ ఆరోగ్య మిషన్ ప్రజలకు అవసరమైన జనరిక్ మందులను ఉచితంగా అందిస్తోంది. ఈ స్కీమ్ను ప్రోత్సహించడానికి, పథకం అమలు చేస్తున్న ఏజెన్సీ ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా పథకం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీ స్థలాన్ని కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతోంది.