న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశంలోని మహిళలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభవార్త చెప్పారు. గృహిణులపై ఆర్థికభారం దించేందుకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.100 తగ్గిస్తున్నట్టు శుక్రవారం ఎక్స్ (ట్విట్టర్)లో ప్రకటించారు. ‘మహిళా దినోత్సవం సందర్భంగా ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.100 తగ్గించాలని కేంద్ర సర్కారు నిర్ణయించింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మహిళలపై ఆర్థికభారాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా మన నారీశక్తికి ప్రయోజనం చేకూరుస్తుంది’ అని మోదీ ట్వీట్ చేశారు. ‘వంటగ్యాస్ను సామాన్యులకు అందుబాటు ధరలోకి తెచ్చేందుకు కృషిచేస్తున్నాం. దేశంలోని కుటుంబాలకు ఆరోగ్యకర వాతావరణం కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని పేర్కొన్నారు. ఇది మహిళా సాధికారత పట్ల తమకున్న చిత్తశుద్ధికి నిదర్శనమని మోదీ చెప్పారు.
ఢిల్లీలో సిలిండర్ ధర రూ.803
తాజా తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో నాన్సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర (14.2 కేజీలు) రూ. 803కు చేరుకోనున్నదని అధికార వర్గాలు తెలిపాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఈ ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నాయి. స్థానిక ట్యాక్స్లను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయని అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయంగా ఆయిల్, గ్యాస్ ధరలు దిగొచ్చిన నేపథ్యంలోనే దేశీయంగా తగ్గింపు సాధ్యమైందని తెలిపారు. అయినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులేదని వెల్లడించారు. కాగా, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద రూ.300 సబ్సిడీ పొందుతున్నవారికి సిలిండర్ రూ. 503కే లభించనున్నది. గత ఆరు నెలల్లో కేంద్రం గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించడం ఇది రెండోసారి. నిరుడు ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఒక్కో సిలిండర్పై కేంద్రం రూ.200 తగ్గించింది.