- చీఫ్ గెస్ట్గా డీజీపీ హాజరు
హైదరాబాద్సిటీ,వెలుగు: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) ఆధ్వర్యంలో 26వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీ–2025 పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఏఐపీఎస్సీబీ) సహకారంతో జరుగుతున్న ఈ పోటీలను మౌలాలిలోని ఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరై పోటీలను ప్రారంభించారు.
జాతీయ స్థాయిలో జరిగే ఈ పోటీల్లో కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, వివిధ రాష్ట్ర పోలీసు విభాగాలు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కు చెందిన బ్యాండ్ బృందాలు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాయి. సంగీతంలో సమన్వయం, క్రమశిక్షణ, నైపుణ్యం ద్వారా భారత పోలీసు వ్యవస్థలోని ఐక్యత, సేవాభావాన్ని పోటీలు ప్రతిబింబించాయి. ఈ మెగా ఈవెంట్లో 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, సీఏపీఎఫ్లు, సీపీఓల నుంచి బృందాలు పాల్గొన్నాయి.
