కొత్త సర్పంచులతో సీఎం మీటింగ్.. ఈ నెల 20 తర్వాత ఆత్మీయ సమ్మేళనానికి ప్లాన్

కొత్త సర్పంచులతో సీఎం మీటింగ్.. ఈ నెల 20 తర్వాత  ఆత్మీయ సమ్మేళనానికి ప్లాన్
  •     కాంగ్రెస్ మద్దతుతో గెలిచినోళ్ల జాబితా రెడీ చేయాలని  ఎమ్మెల్యేలకు ఆదేశాలు 

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచులతో భారీ మీటింగ్​నిర్వహించాలని సీఎం రేవంత్​రెడ్డి భావిస్తున్నారు. గురువారం జరిగే మూడో విడత ఎన్నికలతో పంచాయతీ పోరు ముగుస్తుంది. తర్వాత ఈ నెల 20న సర్పంచుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ వెంటనే హైదరాబాద్ వేదికగా సర్పంచుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. 

ఈ క్రమంలో నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్​మద్దతుతో గెలిచిన సర్పంచుల జాబితాలను సిద్ధం చేయాలని ఎమ్మెల్యేలకు సీఎం నుంచి ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తున్నది.   సర్పంచులకు భరోసా కల్పించడంతో పాటు సర్కారు అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం, సంస్థాగతంగా కాంగ్రెస్​క్యాడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బలోపేతం చేయడం ఈ మీటింగ్​ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తున్నది.  

జాబితాలు రెడీ చేస్తున్న ఎమ్మెల్యేలు.. 

సీఎం ఆదేశాలతో జిల్లా ఇన్-చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచుల లెక్క తీస్తున్నారు. చాలాచోట్ల కాంగ్రెస్​రెబల్స్ కూడా గెలుపొందారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం రెండు విడతల్లో కలిపి 8,566 పంచాయతీల్లో ఎన్నికలు జరగగా..  5,246(61.24శాతం) మంది కాంగ్రెస్​మద్దతుదారులు గెలుపొందారు. స్వతంత్రంగా బరిలోకి దిగి గెలిచిన పలువురు అభివృద్ధి కోణంలో ఇప్పటికే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. వీరిలో చాలామంది కాంగ్రెస్​రెబల్స్​కూడా ఉన్నారు. 

వీరితో పాటు వివిధ పార్టీల మద్దతుతో గెలిచి అధికార పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నవారూ ఉన్నారు. ఇలా పార్టీ మద్దతుతో గెలిచినవారితోపాటు కలిసివచ్చే సర్పంచుల పూర్తి వివరాలతో ఎమ్మెల్యేలు లిస్టులు రెడీ చేస్తున్నారు. ఈ జాబితాలు అందగానే వాటి ఆధారంగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ మీటింగ్​కు సర్పంచులందరికీ ఆహ్వానాలు పంపుతామని కాంగ్రెస్​ముఖ్య నేత ఒకరు తెలిపారు.