
- చార్మినార్ నుంచి చౌమొహల్లా ప్యాలెస్ వరకు హెరిటేజ్ వాక్
- ప్యాలెస్లో విందు.. హాజరైన సీఎం, మంత్రులు
- నేడు వరంగల్ కోట, వెయ్యిస్తంభాల గుడి, రామప్ప సందర్శన
హైదరాబాద్, వెలుగు: చార్మినార్ వద్ద అందాల భామలు సందడి చేశారు. 109 మంది మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్మంగళవారం చార్మినార్ను సందర్శించారు. ఐదు శతాబ్దాలుగా నగరంలో ఠీవిగా ఉన్న కట్టడాన్ని చూసి ఫిదా అయ్యారు. మొదట చార్మినార్కు చేరుకున్న కంటెస్టెంట్లకు అధికారులు రెడ్ కార్పెట్తో వెల్కమ్ చెప్పారు. స్థానిక కళాకారులు వీరికి సంప్రదాయక అరబ్బీ మార్ఫా వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. దీనికి పలువురు కంటెస్టెంట్స్ స్టెప్పులు వేస్తూ ముందుకు కదిలారు. అందాల భామల రాకతో చార్మినార్ పరిసరాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి.
ప్రత్యేకంగా చార్మినార్ వద్ద ఫొటో షూట్కు హాజరైన ముద్దుగుమ్మలు ప్రజలకు అభివాదం చేస్తూ, తమ ఆనందాన్ని పంచుకున్నారు. చార్మినార్ అందాలను తమ సెల్ఫోన్లలో బంధించారు. చారిత్రక కట్టడం ముందు హెరిటేజ్ వాక్ చేశారు. చార్మినార్ సమీపంలోని ప్రసిద్ధ చుడీ బజార్ (లాడ్ బజార్)లో గాజులు, ముత్యాల హారాలు, ఇతర అలంకరణ వస్తువుల షాపింగ్ చేశారు. హస్తకళల నైపుణ్యంతో తయారు చేసిన వస్తువులను చూసి ఆశ్చర్యపోయారు. గాజుల తయారీ ప్రక్రియను స్వయంగా పరిశీలించి, నిపుణులైన కారిగర్లు (కళాకారులు), శిల్పుల ప్రతిభను ప్రశంసించారు. వారి శ్రమ, నైపుణానికి మంత్ర ముగ్ధులయ్యారు.
ఫ్రీగా ఇచ్చిన వ్యాపారులు..
మిస్ వరల్డ్ పోటీదారులు లాడ్బజార్లో షాపింగ్చేయగా, వారు కొన్న ఏ వస్తువుకూ వ్యాపారులు డబ్బులు తీసుకోలేదు. హైదరాబాద్ విశిష్టత, చార్మినార్, లాడ్ బజార్ ప్రత్యేకతలను విశ్వవ్యాప్తం చేయాలని కోరారు. తమ దుకాణాలకు వచ్చిన అందాల తారలకు దుకాణదారులు గులాబీ పూలు ఇచ్చి ఆహ్వానించారు.
మర్చిపోలేని అనుభూతి: కంటెస్టెంట్లు
‘‘చౌమొహల్లా ప్యాలెస్ అద్భుతంగా ఉంది. హైదరాబాద్ ఆతిథ్యం మమ్మల్ని మురిపిస్తోంది. ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. ఈ పర్యటన జీవితాంతం గుర్తుంటుంది. ‘తెలంగాణ.. జరూర్ ఆనా’ నినాదం మా దేశాల్లో వినిపిస్తాం’’ అని అందాల భామలు తెలిపారు.
కంటెస్టెంట్స్కు స్వాగతం: నాగార్జున
మిస్ వరల్డ్ పోటీదారులకు హైదరాబాద్ స్వాగతం పలుకుతోందని హీరో నాగార్జున అన్నారు. ‘మీ ప్రతిభతో మిస్ వరల్డ్ పోటీ ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ఈవెంట్తో హైదరాబాద్ ప్రపంచపటంలో నిలిచిపోతుంది’ అని అన్నారు. హైదరాబాద్లో హిందూ, ముస్లింలు సామరస్యంతో జీవించడం నచ్చిందని.. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఈ విషయాన్ని గమనించామని నమీబియా ప్రతినిధి పేర్కొన్నారు.
నేడు ఓరుగల్లుకు అందాల భామలు..
విశ్వసుందరీల బృందం బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనాల్లో ఓరుగల్లుకు చేరుకోనుంది. హనుమకొండలోని వెయ్యిస్తంభాల గుడి, వరంగల్కోటతో పాటు ములుగు జిల్లాలోని రామప్పను సందర్శించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
చౌమొహల్లా ప్యాలెస్లో విందు..
అందాల భామలు చార్మినార్ నుంచి చౌమొహల్లా ప్యాలెస్ వరకు హెరిటేజ్ వాక్ చేశారు. చౌమొహల్లా ప్యాలెస్లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కు ప్రభుత్వం స్వాగత విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్, ఆయన కుటుంబసభ్యులు, మంత్రులు జూపల్లి, పొన్నం హాజర య్యారు. హైదరాబాద్తో పాటు చార్మినార్, చౌమొహల్లా ప్యాలెస్, ఇతర చారిత్రాక నిర్మాణాలు, కట్ట డాలపై అధికారులు వీడియో ప్రజంటేషన్ ఇచ్చారు. ప్యాలెస్లోపల కలియతిరిగిన ముద్దుగుమ్మలు ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు.
నిజాం వంశస్తుల రాజ సింహాసనం, వారు వినియోగించిన వస్తువులు, ఆయుధాలు, వంట సామగ్రిని ఆసక్తిగా తిలకించారు. ప్యాలెస్ 300 ఏండ్ల చరిత్ర, విశిష్టతను తెలుసుకున్నారు. పసందైన హైదరాబాదీ వంటకాలు, రుచికరమైన విం దును ఆరగించారు. వంటకాలన్నీ బాగున్నాయని, ప్యాలెస్ సందర్శనకు అవకాశం ఇచ్చిన తెలం గాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విందులో మిస్ వరల్డ్–2024 క్రిస్టినా ప్రిస్కోవా, హీరో నాగార్జున, హీరోయిన్ శ్రీలీల, నేపాల్, ఇండోనేషియా, తదితర విదేశీ రాయబారులు పాల్గొన్నారు.