- త్వరలోనే డిపార్ట్మెంట్ల వారీగా నోటిఫికేషన్లు
- ఐదు డిపార్ట్మెంట్లలోనే ఎక్కువగా ఖాళీలు
- మొత్తం శాంక్షన్డ్ పోస్టులు 40.78 లక్షలు
- ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులు 31.91 లక్షలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పది లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రధాని నరేంద్రమోడీ అనుమతిచ్చారు. దేశవ్యాప్తంగా ఏడాదిన్నరలోపు యుద్ధప్రాతిపదికన రిక్రూట్మెంట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ట్వీట్ చేసింది. కేంద్ర మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లలోని ఉద్యోగాల సంఖ్య, ఖాళీలపై ఇటీవల ప్రధాని రివ్యూ నిర్వహించారు. ఖాళీలను గుర్తించి, భర్తీ కోసం నిర్ణయం తీసుకున్నారు. ‘‘అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాల్లోని హ్యూమన్ రిసోర్స్పై ప్రధాని సమీక్ష చేపట్టారు. రాబోయే ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలను వేగంగా భర్తీ చేయాలని ఆదేశించారు” అని ట్వీట్లో పీఎంవో పేర్కొంది. త్వరలోనే డిపార్ట్మెంట్ల వారీగా వేకెన్సీల వివరాలను, నోటిఫికేషన్లను అధికారులు విడుదల చేయనున్నారు. ప్రతిపక్షాలు నిరుద్యోగ సమస్యలపై కేంద్రాన్ని విమర్శిస్తూ వస్తున్నాయి. ఇదే సమస్యతో 2024 జనరల్ ఎలక్షన్స్లో మోడీ సర్కార్ను ఎదుర్కోవాలని వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే.. తాజా ప్రకటనతో ఆ విమర్శలకు కేంద్రం చెక్ పెట్టినట్లయిందని బీజేపీ వర్గాలు అంటున్నాయి.
21.75 శాతం ఖాళీలు
కేంద్రంలో 2020 మార్చి 1 నాటికి 21.75 శాతం ఖాళీలు ఉన్నట్లు వేతనాలు, భత్యాల ఖర్చులు చూసే శాఖ (డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆన్ పే అండ్ అలవెన్స్) నిరుడు వార్షిక రిపోర్టులో పేర్కొంది. దాని ప్రకారం.. 40.78 లక్షల శాంక్షన్డ్ పోస్టులు ఉండగా, అందులో 31.91 లక్షల మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. దాదాపు 21.75% ఖాళీలు ఉన్నాయి. 2020 మార్చి 1 వరకు ఎనిమిదిన్నర లక్షల ఖాళీలు ఉన్నట్లు గతంలో పార్లమెంట్లో కేంద్రం కూడా ప్రకటించింది.
మొత్తం పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఐదు ప్రధాన మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లలోనే 92 శాతం (31.33 లక్షలు) మంది ఉన్నారు. ఇందులో రైల్వేస్లో 40.55 శాతం, హోం అఫైర్స్లో 30.5శాతం, డిఫెన్స్ (సివిల్)లో 12.31, పోస్టల్లో 5.66 శాతం, రెవెన్యూలో 3.26 శాతం మంది పనిచేస్తున్నారు. మరో 7.72 శాతం ఇతర విభాగాల్లో పనిచేస్తున్నట్లు వార్షిక రిపోర్టు చెప్తున్నది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఎంప్లాయీస్ కోసం రూ. 2,08,960.17 కోట్లు ఖర్చు చేయగా.. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,25,744.7 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది.
ఐదు డిపార్ట్మెంట్లలోనే ఎక్కువ ఖాళీలు
2020 మార్చి 1 వరకు ఎనిమిదిన్నర లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్ఫెండీచర్ వార్షిక రిపోర్టు చెప్తున్నప్పటికీ ఈ రెండేండ్లలో మరిన్ని ఖాళీలు ఏర్పడి అవి పది లక్షలు దాటాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. అందులో భాగంగానే పది లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రధాని మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నాయి. ప్రధానంగా పోస్టల్, డిఫెన్స్ (సివిల్), రైల్వేస్, రెవెన్యూ, హోం అఫైర్స్లో ఎక్కువగా ఖాళీలు ఉన్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. రైల్వేస్లో 15 లక్షల వరకు శాంక్షన్డ్ పోస్టులు ఉండగా.. ప్రస్తుతం 2.3 లక్షల ఖాళీలు ఉన్నాయి. డిఫెన్స్ (సివిల్) డిపార్ట్మెంట్లో దాదాపు 6.33 లక్షల శాంక్షన్డ్ పోస్టులు ఉండగా.. ప్రస్తుతం 2.5 లక్షల ఖాళీలు ఉన్నాయి. పోస్టల్ డిపార్ట్మెంట్లో 2.67 లక్షల శాంక్షన్డ్ పోస్టులకు గాను.. ప్రస్తుతం 90 వేల ఖాళీలు ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో 1.78 లక్షల శాంక్షన్డ్ పోస్టులకు గాను.. 74 వేల ఖాళీలు ఉన్నాయి. హోం అఫైర్స్లో 10.8 లక్షల శాంక్షన్డ్ పోస్టులు ఉండగా.. అందులో దాదాపు 1.3 లక్షల ఖాళీలు ఉన్నాయి. ఖాళీలు భర్తీ కాక ఉన్న ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతున్నదని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
ప్రధాని మోడీ తాజా ప్రకటనతో పోస్టులు భర్తీ అయితే.. ఉద్యోగులపై ఒత్తిడి తగ్గుతుందని, కొత్తవారికి అవకాశాలు దక్కుతాయని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో ఈ కొలువుల జాతర తమ ప్రభుత్వానికి మరింత పాజిటివ్ వేవ్ను తీసుకువస్తుందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ప్రతిపక్షాలు మాత్రం ఉద్యోగాల భర్తీ ప్రకటనపై విమర్శలు సంధించాయి. ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అధికారంలోకి వచ్చిన మోడీ.. ఆ లెక్కన ఎనిమిదేండ్లలో 16 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందని, కానీ 10 లక్షల ఉద్యోగాలంటూ కొత్త డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డాయి.
ఇది మహా జుమ్లా: రాహుల్
ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎనిమిదేండ్ల కింద మోడీ హామీ ఇచ్చారని, ఇప్పుడు కూడా అదే పద్ధతిలో 10 లక్షల ఉద్యోగాలంటూ మభ్యపెడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. ‘‘ఇది జుమ్లా ప్రభుత్వమే కాదు.. మహా జుమ్లా ప్రభుత్వం. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి? ఉద్యోగాలు సృష్టించడంలో ప్రధాని మోడీ నిపుణుడు కాదు.. కానీ, ఉద్యోగాల వార్తలు సృష్టించడంలో మాత్రం నిపుణుడు” అంటూ ట్విట్టర్లో దుయ్యబట్టారు.