
కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లి పరిధిలోని ఆల్విన్కాలనీలో సుమారు రూ.100 కోట్ల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నో ఏండ్లుగా వివాదాస్పదంగా మారిన భూమిని ఎట్టకేలకు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూకట్పల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 276లో మొత్తం 1.39 ఎకరాల భూమి ఉండగా, ఇప్పటికే కొంత భూమి ఆక్రమణలకు గురైంది.
ఆల్విన్కాలనీ మధ్యలో ఉండడం వల్ల ఈ భూమి విలువ కనీసం రూ.వంద కోట్లు ఉంటుందని అంచనా. ఈ భూమిని కూడా కబ్జా చేయడానికి గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. ఈ భూమి తమదంటూ ఆల్విన్ఎంప్లాయిస్హౌసింగ్సొసైటీ పోరాడుతూ వస్తుంది. అదే సమయంలో ఆల్విన్కాలనీ సంక్షేమ సంఘం మాత్రం ఈ భూమిని కాపాడి పార్క్గా అభివృద్ధి చేయాలని డిమాండ్చేస్తూ వచ్చింది. 1986లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆల్విన్ఫ్యాక్టరీలో పని చేసే ఉద్యోగుల కోసం సర్వే నంబర్ 276లోని 79.29 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ భూమిని రెండు దశల్లో ప్లాట్లుగా విభజించి ఆల్విన్ఉద్యోగులకు కేటయించారు.
అప్పటికీ కొందరు ఉద్యోగులు మిగిలిపోవడంతో కాలనీని ఆనుకుని ఉన్న ఇదే సర్వేనెంబర్ 276లోని 2.39 ఎకరాల భూమిని కూడా తమ సొసైటీకి కేటాయించాలని ఆల్విన్ హౌసింగ్ సొసైటీ కోరుతూ వచ్చింది. ఇందుకోసం సొసైటీ తరఫున ప్రభుత్వానికి డబ్బు కూడా చెల్లించామని సొసైటీ చెబుతుండగా, ఇదంతా అబద్ధమని సంక్షేమ సంఘం ఆరోపిస్తుంది.
ఈ క్రమంలో సంక్షేమ సంఘం ప్రతినిథులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ని కలిసి ప్రజావాణిలోఈ భూమి విషయమై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు. ఈ విషయంపై విచారణ చేసిన హైడ్రా 2.39 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని నిర్ధారించుకుంది. ఇప్పటికే ఇండ్లు వచ్చిన ప్రాంతాన్ని వదిలేసి.. బుధవారం మిగిలిన 1.20 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.