- గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో
- 4 గంటల వరకే ఓటింగ్మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని సమస్యాత్మక నియోజకవర్గాల్లో గంట ముందే పోలింగ్ ముగించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. మావోయిస్టుల ప్రభావం ఉండే గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని 13 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది.
మిగతా 106 స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. అటవీ, సమస్యాత్మక ప్రాంతాల నుంచి పోలింగ్ బాక్సులు నియోజకవర్గ కేంద్రాలకు సకాలంలో తరలించేందుకు వీలుగా సీఈసీ ఈ నిర్ణయం తీసుకున్నది. గంట ముందే పోలింగ్ముగించే నియోజకవర్గాల్లో మంథని, చెన్నూరు, సిర్పూర్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఇల్లందు, పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం, కొత్తగూడెం ఉన్నాయి. గతంలోనూ ఈ నియోజకవర్గాల్లో పోలింగ్ టైమ్ను గంట తగ్గించారు.