హైదరాబాద్లోని మియాపూర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. మియపూర్ ఓంకార్ నగర్లో నిన్న సాయంత్రం కనిపించకుండా పోయిన 13 నెలల పాప.. ఇంటి పక్కన అనుమానాస్పద స్థితిలో విగత జీవిగా కనిపించింది. మొదట ఏదో బొమ్మ అని అనుకుని ఎవరూ పట్టించుకోలేదని, ఆ తర్వాత ఆ చిన్నారి మృతదేహమని పాప అమ్మమ్మ గుర్తించింది. దీంతో పసికందు తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. నిన్న రాత్రి వరకూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించిన పాపను ఆ స్థితిలో చూసి తట్టుకోలేక గుండెలవిసిపోయేలా విలపించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, పాప మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పాప నీటిలో పడి మరణించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయని, ఇది పొరబాటున జరిగిందా లేక ఎవరైనా హత్య చేసి అక్కడ పడేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.