
- 95% సీట్లు సర్కారు స్టూడెంట్లకే
- ఫస్ట్ ఫేజ్ లిస్టు రిలీజ్ చేసిన బుర్రా వెంకటేశం
హైదరాబాద్, వెలుగు: బాసర ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ)లో 2024–25 విద్యా సంవత్సరానికి గాను ఆరేండ్ల బీటెక్ ఇంజినీరింగ్ కోర్సులో ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తయింది. మొత్తం 1,404 మంది విద్యార్థులకు సీట్లను అలాట్ చేశారు. బుధవారం సెక్రటేరియట్లో ఫస్ట్ ఫేజ్ షార్ట్ లిస్టును ఆర్జీయూకేటీ ఇన్చార్జి వీసీ వెంకటరమణతో కలిసి విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం రిలీజ్ చేశారు.
ఈ ఏడాది ఆర్జీయూకేటీలో 1,500 సీట్లకు జూన్లో అప్లికేషన్లను స్వీకరించగా, సుమారు 15 వేల మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో టెన్త్ జీపీఏ ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయించారు. మిగిలిన సీట్లకు త్వరలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వెంకటరమణ ప్రకటించారు. ప్రస్తుతం అలాట్ చేసిన 1,404 మందిలో 976 మంది అమ్మాయిలు, 428 మంది అబ్బాయిలు ఉన్నారు.
సీట్లు పొందిన వారిలో 95 శాతం మంది సర్కారు స్కూల్ విద్యార్థులు ఉండగా, 5% మాత్రమే ప్రైవేటు స్కూల్ స్టూడెంట్లు ఉన్నారు. ఫస్ట్ ఫేజ్లో అధికంగా సిద్దిపేటలో 330 మంది, నిజామాబాద్లో 157 మంది, సంగారెడ్డి 132, రాజన్న సిరిసిల్లలో 81, నిర్మల్ 72, కరీంనగర్ 66, కామారెడ్డిలో 64, నల్గొండలో 61 మంది ఉండగా, అత్యల్పంగా వనపర్తి, జోగులాంబలో ఒక్కొక్కరికి సీట్లు అలాట్ అయ్యాయి.
కాగా, ఈ నెల 4న పీహెచ్, స్పోర్ట్స్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్, 5న ఎన్సీసీ, సీఏపీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఈ నెల 8, 9, 10 తేదీల్లో ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ఉంటుందని చెప్పారు.
సగం తగ్గిన అప్లికేషన్లు..
ఈ ఏడాది బాసర ట్రిపుల్ ఐటీకి భారీగా దరఖాస్తులు తగ్గాయి. కేవలం 15 వేల మందే అప్లయ్ చేసుకున్నారు. 2023–24లో 32 వేలు, 2022–23లో 31 వేల అప్లికేషన్లు అందాయి. కానీ, ఈ ఏడాది మాత్రం సగం అప్లికేషన్లు తగ్గడం అధికారులను విస్మయానికి గురిచేస్తోంది.