- పురుష ఓటర్ల కన్నా 2 లక్షలు ఎక్కువ
- కొత్త డేటా రిలీజ్ చేసిన సీఈవో ఆఫీస్
- మార్పులు చేర్పులకు వచ్చే నెల 15 వరకు డెడ్లైన్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. మొత్తం 17 ఎంపీ సెగ్మెంట్లలోని ఓటర్ల వివరాలను ఆప్డేట్చేసి తాజా వివరాలను అధికారులు మంగళవారం వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 3,30,13,318 మంది ఓటర్లు ఉంటే.. ఇందులో మహిళలు 1,65,95,896 మంది ఉన్నారు. మిగిలినవారు (1,64,14,693 మంది) పురుష ఓటర్లు. అంటే పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు దాదాపు 2 లక్షలు మంది ఎక్కువ ఉన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందిలో సర్వీసు ఓటర్లు 15,472 మందికాగా..మొత్తం ఓటర్లలో ఫస్ట్ టైమ్ ఓటు హక్కు వినియోగించుకుంటున్నవారు 8,72,116 మంది యూత్ ఉన్నారు.
సూపర్ సీనియర్ సిటిజెన్స్ (85 ఏండ్లు పైబడిన) ఓటర్లు 1,93,472 మంది ఉన్నట్లు సీఈవో ఆఫీస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు తయారైన ముసాయిదా ఓటర్ల జాబితాలో అడ్రస్ మార్చుకోవాలనుకునేవారు, ఒక నియోజకవర్గం నుంచి మరో చోటికి బదిలీ కావాలనుకునేవారికి వచ్చే నెల 15 వరకు సీఈవో ఆఫీస్ వెసులుబాటు కల్పించింది. కొత్తగా ఓటర్ల దరఖాస్తులను మార్చి 25వ తేదీ నాటికి కంప్లీట్ చేయడంతో మొత్తం ఓటర్ల సంఖ్య 3.30 కోట్లుగా తేలిందని అధికారులు పేర్కొన్నారు.
రెండు వారాల్లో రూ. 38 కోట్ల నగదు సీజ్
లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత 10 రోజుల వ్యవధిలో రాష్ట్రంలో మొత్తం రూ. 38.12 కోట్ల మేర నగదు, మద్యం తదితరాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఈవో ఆఫీస్ తెలిపింది. ఇందులో నగదు రూపంలో 9.10 కోట్లు స్వాధీనంకాగా, సుమారు రూ. 8.14 కోట్ల విలువైన 28 కిలోల బంగారం, వెండి ఆభరణాలు కూడా ఉన్నట్లు వివరించింది. రూ. 13.66 కోట్ల విలువైన 4 లక్షల లీటర్ల మద్యాన్ని కూడా సీజ్ చేసినట్లు తెలిపింది.
ఈ నెల 16న కరీంనగర్ టౌన్లోని ప్రతిమా మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ లో ఒకేసారి రూ. 6.67 కోట్ల మేర నగదును స్వాధీనం చేసుకున్నామని, ఈ నగదుకు సంబంధించి థియేటర్ మేనేజర్ తగిన ధ్రవీకరణ పత్రాలు, ఆధారాలను చూపించలేదని వివరించింది. దాంతో నగదును ఆదాయపు పన్ను శాఖకు అప్పగించామని పేర్కొంది.