
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మావోయిస్ట్ పార్టీకి చెందిన 17 మంది భద్రాద్రి జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్లో ఎస్పీ రోహిత్రాజ్ వివరాలు వెల్లడించారు. లొంగిపోయిన వారిలో ఇద్దరు ఏరియా కమిటీ మెంబర్లు, నలుగురు పార్టీ మెంబర్లు, 11 మంది మిలీసియా సభ్యులు ఉన్నారన్నారు.
చత్తీస్గఢ్కు చెందిన మడవి హుంగ, సున్నం లచ్చు, సవలం లలిత, మడవి శుల, మడవి బండి, నుప్పా లక్ష్మి, కవసి అడుమ, మడకం సోమ్డు, నుపు ఉంగి, వంజం ఉంగ, కల్ము దుడవ, మడవి లక్మ, మడకం సహదేవ్, ముచకి దడే, కొవ్వాసి నందే, మడకం హడ్మ, నుపు ముయ లొంగిపోయినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఓఎస్డీ జి.నరేందర్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్సింగ్, అడిషనల్ కమాండెంట్లు ప్రీతా, రవిశర్మ, ఏఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, చర్ల సీఐ రాజు, ఆర్ఐ ఆపరేషన్స్ రవి పాల్గొన్నారు.
మందుపాతర పేలి ముగ్గురికి గాయాలు
భద్రాచలం, వెలుగు : మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో ముగ్గురు గ్రామస్తులు గాయపడ్డారు. ఈ ఘటన చత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... జిల్లాల్లోని మద్దేడు పోలీస్స్టేషన్ పరిధిలోని దంపయా ఎర్రాగుఫా గ్రామానికి చెందిన గోటే జోగా, వివేక్ ధోరి, బద్దె సునీల్ కూలీ పనుల కోసం బందెపారా గ్రామానికి వెళ్తున్నారు.
ఈ క్రమంలో గ్రామ శివారులోని అడవుల్లో భద్రతాబలగాలను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబుపై ఓ వ్యక్తి కాలు వేయడంతో అది ఒక్కసారిగా పేలింది. దీంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ను పంపించి గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించారు. మద్దేడు పోలీసులు సమీప అడవుల్లో కూంబింగ్ చేపట్టారు.