
- ప్రభుత్వానికి ఇరిగేషన్ శాఖ అధికారుల స్పష్టీకరణ
- దీనిపై త్వరగా నిర్ణయం తీసుకుంటేనే మేలన్న అభిప్రాయాలు
- మనకు నీటి వాటాలు క్లెయిమ్ చేసుకునేందుకు వీలుంటుందంటున్న అధికారులు
హైదరాబాద్, వెలుగు: బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే 180 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకోవచ్చని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. అక్కడ నీటి లభ్యత ఉండదన్న బీఆర్ఎస్పార్టీ లీడర్ల వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నారు. తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందన్న సెంట్రల్వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) వాదనలకు.. ఇరిగేషన్అధికారుల వివరణ కూడా బలం చేకూరుస్తున్నది.
తుమ్మిడిహెట్టి వద్ద 160 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణానికి 2005లోనే నాటి కాంగ్రెస్ప్రభుత్వం శంకుస్థాపన చేసి ప్రాజెక్టును ప్రారంభించింది. కెనాల్నెట్వర్క్పనులనూ మొదలుపెట్టింది. ఇంతలో పర్మిషన్లు ఆలస్యం కావడంతో ఆ ప్రాజెక్టు అటకెక్కింది. ఈ ప్రాజెక్టు ద్వారా 160 టీఎంసీల నీటిని ఎల్లంపల్లికి తరలించి అక్కడి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్జిల్లాలోని 3.5 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలన్నది టార్గెట్.
అయితే, ఇప్పుడు 160 టీఎంసీలే కాదు.. అదనంగా మరో 20 టీఎంసీలనూ ఈ ప్రాజెక్టు ద్వారా వాడుకునేందుకు వీలవుతుందని అధికారులు స్పష్టం చేశారు. అఖిలపక్ష సమావేశంలో ఇదే విషయాన్ని ప్రభుత్వానికి అధికారులు వివరించారు.
ప్రభుత్వం ఓకే అంటే ముందుకే..
తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని నిర్మించడంపై ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిన సర్కార్.. దానిపై ప్రస్తుతం డైలమాలో పడింది. తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాలా? లేదంటే వార్ధా వద్ద కట్టాలా? అన్న దానిపై క్లారిటీ లేకుండా పోయింది. మరోవైపు వార్ధా బ్యారేజీ డీపీఆర్ను కేంద్రం వెనక్కు పంపింది. వాస్తవానికి 11.50 టీఎంసీల వినియోగంతో నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్జిల్లాలోని లక్షన్నర ఎకరాలకు నీళ్లివ్వాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా తుమ్మిడిహెట్టి వద్ద కట్టాలా లేదంటే వార్ధా వద్ద నిర్మించాలా అన్నదానిపై ఓ నిర్ణయం తీసుకుంటే ముందుకెళ్లొచ్చన్న ప్రతిపాదనలు పెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణంపై సానుకూలంగానే ఉన్నది. కచ్చితంగా కట్టి తీరుతామంటూ పలు సందర్భాల్లో ఇటు సీఎం రేవంత్, ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రకటించారు.
ఈ నేపథ్యంలోనే ఏపీ బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించడానికి ముందే తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణాన్ని చేపడితే.. మన నీటి వాటాలను క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఎల్లంపల్లి ఇంటిగ్రేషన్తో సాధ్యమే..
ఎల్లంపల్లి ప్రాజెక్టును ఏటా 60 టీఎంసీల నీటిని వాడుకునేలా నిర్మించారు. అందులో నేరుగా 40 టీఎంసీల వాడకానికి అనువుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మిగతా 20 టీఎంసీలను తుమ్మిడిహెట్టితో ఇంటిగ్రేట్చేసుకుని వ్యవసాయానికి నీళ్లిచ్చుకోవచ్చన్న అభిప్రాయాన్ని ప్రభుత్వం ముందుంచారు.
అంటే తుమ్మిడిహెట్టితో నేరుగా 160 టీఎంసీలను తీసుకురావడంతో పాటు.. ఇటు ఎల్లంపల్లి నుంచి ఇంటిగ్రేట్చేసిన 20 టీఎంసీలను కలిపి 180 టీఎంసీలను వాడుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రాజెక్టును కడితే బాగుంటుందన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఎలాగూ కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకునే పరిస్థితి లేదు కాబట్టి.. తుమ్మిడిహెట్టిని మళ్లీ పట్టాలెక్కిస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లు ఇవ్వొచ్చంటున్నారు.