
పంజాగుట్ట, వెలుగు: బేగంపేటలోని మహాత్మా జ్యోతి బా ఫూలే ప్రజాభవన్ లో ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. భూ సమస్యలు, వీఆర్ఏలకు ఉద్యోగాలు కల్పించాలని, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సాయం కోరుతూ పలువురు అర్జీలు అందజేశారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఫిర్యాదుదారులను ప్రజాభవన్లోకి అధికారులు అనుమతించారు.
మొత్తం 1,906 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. వీఆర్ఏల సర్దుబాటుకు తెచ్చిన జీవో 81, 85లను సవరించి 55 – 61 ఏళ్ల లోపు వృద్ధ వీఆర్ఏల కుటుంబాలకు న్యాయం చేయాలని ప్ల కార్డులు చేతపట్టి కోరారు. యాదాద్రి జిల్లా మండలంలోని దాతారుపల్లి రెవెన్యూ పరిధి పెద్దిరెడ్డి గూడెంలో పుణ్యభూమి వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి న్యాయం చేయాలంటూ బాధితులు దివ్య జ్యోతి, జ్ఞానేశ్వర్, రంగనాథ్ కోరారు. సింగరేణి కాంట్రాక్ట్కార్మికులకు వేతనాలు పెంచి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంఘం ప్రధాన కార్యదర్శి బి.మధు ఫిర్యాదు అందజేశారు.
ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ లో తమకు 25 ఎకరాల భూమి ఉందని, అందులో 6.17 కుంటలు తహసీల్దార్, ఆర్ఐ కలిసి వేరొకరికి బదలాయించారని, తిరిగి మా భూమి ఇప్పించాలని జాదవ్, మాధవ్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వయోజన విద్య (రాత్రి) బడులు చెప్పే తమను కేసీఆర్అన్యాయంగా 2018లో తొలగించారని, తిరిగి విధుల్లోకి తీసుకునేలా సీఎం రేవంత్ చర్యలు తీసుకోవాలని సంధ్యారాణి, రజని, అరుణ కోరారు.
నోడల్ అధికారి దివ్య పర్యవేక్షణలో ప్రజావాణి నిర్వహించగా.. మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఫిర్యాదుదారుల సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు ఫోన్చేసి పరిష్కరించాలని కోరారు. ప్రజావాణికి వచ్చిన ప్రతి అర్జీని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ప్రజాభవన్కు వచ్చిన అర్జీదారులతో ఆయన మాట్లాడారు. సమస్యలు తెలుసుకొని దరఖాస్తులు స్వీకరించారు.