కశ్మీర్‌‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు టెర్రరిస్టులు హతం

కశ్మీర్‌‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు టెర్రరిస్టులు హతం

జమ్ము కశ్మీర్‌‌లోని సోపియన్ జిల్లా చౌగామ్‌లో ఈ రోజు (శనివారం) తెల్లవారుజామున భద్రతా బలగాలు, టెర్రరిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. చౌగామ్‌ ఏరియాలో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న  సమాచారంతో ఆర్మీ, కశ్మీర్ పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. అనుమానిత ప్రాంతంలో కార్డన్ సెర్చ్ చేపట్టగా, ఉగ్రవాదులు నక్కి నక్కి.. మన జవాన్లపై కాల్పులు జరిపారు. దీంతో ఆర్మీ సైనికులు, పోలీసులు కలిసి దీటుగా ఎదురు దాడి చేశారు. హోరాహోరీ కాల్పుల మోత అనంతరం ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని కశ్మీర్ డీజీపీ దల్బీర్ సింగ్ చెప్పారు. మరణించిన ఇద్దరు లష్కరే తొయిబా టెర్రరిస్టులని,  ఒకడు పుల్వామాకు చెందిన రజా బాసిత్ నజీర్, మరొకడు బందిపొరాకు చెందిన సాజద్ అహ్మద్ చెక్ అని తెలుస్తోంది. 

కాగా, ఎన్‌కౌంటర్‌‌ స్పాట్‌ నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో మరెవరైనా టెర్రరిస్టులు దాగి ఉన్నారేమోనన్న అనుమానంతో సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తూనే ఉన్నారు.