కోల్ కతా: టీఎంసీ రెబల్ నేతలకు ఆ పార్టీ అధినేత్రి, మాజీ సీఎం మమతా బెనర్జీ సవాల్ విసిరారు. తిరుగుబాటు నాయకులకు దమ్ముంటే నేరుగా బీజేపీలో చేరి తనను ఎదుర్కోవాలని ఛాలెంజ్ చేశారు. తాను చనిపోయానని అనుకుంటున్నారా అంటూ రెబల్ నేతలను ఉద్దేశించి భావోద్వేగ వ్యా్ఖ్యలు చేశారు. తిరుగుబాటుదారులు పార్టీకి చేసిన ద్రోహాన్ని తమకు ఓటు వేసిన ప్రజలకు చేయకూడదని హితవు పలికారు.
టీఎంసీలో చీలికకు బీజేపీనే కారణమని.. అసమ్మతి నేతలకు ఆ పార్టీనే మద్దతు ఇస్తోందని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో అధికారం కోసం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్ చోరీకి పాల్పడిందని పునరుద్ఘాటించారు. ఓట్ల రిగ్గింగ్ ద్వారా బీజేపీ అధికారంలోకి వచ్చిందనే విషయం అందరికీ తెలుసన్నారు. అధికారంలోకి వచ్చాక టీఎంసీ నేతలపై బీజేపీ అక్రమ కేసులు బనాయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తప్పుడు కేసులకు భయపడొద్దని.. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
2026, ఏప్రిల్లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. 294 అసెంబ్లీ స్థానాలకు గాను టీఎంసీ కేవలం 80 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ 200కు పైగా స్థానాల్లో విజయఢంకా మోగించి బెంగాల్ గడ్డపై తొలిసారి కాషాయ జెండా ఎగరేసింది.
ALSO READ : చావు కోసమే వస్తుండు: ఆస్ట్రేలియా పర్యటన వేళ ప్రధాని మోడీకి హత్య బెదిరింపులు
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం టీఎంసీలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. 20 మంది లోక్ సభ ఎంపీలు, 60 మంది ఎమ్మెల్యే పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగరేశారు. దీదీకి అత్యంత సన్నిహితులు కూడా పార్టీని వీడుతున్నారు. దీంతో 15 ఏళ్ల పాటు బెంగాల్ను శాసించిన టీఎంసీ తీవ్ర సంక్షోభానికి గురవుతోంది.
