కేరళలో విషాదంచోటు చేసుకుంది. అలప్పుజ బీచ్ లో కొట్టుకుపోయిన రెండున్నరేళ్ల బాలుడు మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు.
కేరళ పోలీసుల కథనం ప్రకారం..
ఓ మహిళ తన ముగ్గురు పిల్లలు, ఆమె సోదరుడితో కలిసి కేరళ అలప్పుజ ప్రాంతంలో పెళ్లికి వచ్చింది. పెళ్లి శుభకార్యం అనంతరం ఆదివారం అలప్పుజ బీచ్ లో ఎంజాయ్ చేసేందుకు వెళ్లారు. అయితే అక్కడ సముద్ర అలలు కారణంగా బీచ్ లోకి ప్రవేశించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు.
అయినప్పటికీ మహిళ తన సోదరుడు పిల్లలతో కలిసి ఈఎస్ఐ ఆసుపత్రికి సమీపంలో ఉన్న బీచ్కు చేరుకున్నారు. అక్కడ పోలీసుల పహారా నుంచి రహస్యంగా బీచ్ లోకి ప్రవేశించారు.
అనంతరం మహిళ తన పిల్లలతో బీచ్ లో తిరిగింది. కొద్దిసేపటి తరువాత పిల్లలతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో సముద్రపు అలలు ఒక్కసారిగా దూసుకురావడంతో తల్లి,పిల్లలు నీటిలో కొద్ది దూరం కొట్టుకుపోయారు. సమీపంలో ఉన్న బాధితురాలి సోదరుడు మెరుపు వేగంతో ఆమెను,ఆమె ఆరేళ్లు, ఏడేళ్ల వయస్సున్న పిల్లల్ని కాపాడాడు.
అలల దాటికి రెండున్నరేళ్ల బాబు సముద్రంలో కొట్టుకుపోయాడు.దీంతో తన కుమారుణ్ని కాపాడాలంటూ బాధితురాలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు సమాచారం అందించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు..తప్పిపోయిన బాలుడి కోసం మెరైన్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం, మత్స్యకారుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ గాలింపు చర్యల్లో ఆదివారం మధ్యాహ్నం కేరళలోని అలప్పుజలోని బీచ్లో కొట్టుకుపోయిన రెండున్నరేళ్ల బాలుడు మంగళవారం చనిపోయినట్లు నిర్ధారించారు. రెండు రోజుల తీవ్రమైన గాలింపు చర్యల తరువాత అలప్పుజలోని గెలీలియో బీచ్ వద్ద బాలుడి మృతదేశాన్ని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
