2015 గ్రూప్ -2 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట ..సింగిల్ బెంచ్ తీర్పు సస్పెండ్

2015 గ్రూప్ -2  ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట ..సింగిల్ బెంచ్ తీర్పు సస్పెండ్

 2015 గ్రూప్ -2  ర్యాంకర్లకు హైకోర్టులో  ఊరట లభించింది.  వాళ్ల నియామకాలను రద్దు చేయాలని ఇటీవల సింగిల్ బెంచ్ ఇచ్చిన  తీర్పును  సస్పెండ్ చేసింది హై కోర్టు డివిజన్ బెంచ్.

2015 గ్రూప్-2 ఫలితాలపై  సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ  టీజీపీఎస్ సీ డివిజన్ బెంచ్ ను  ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై ఇవాళ(నవంబర్ 27) విచారణ చేపట్టిన హైకోర్టు..  సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది .

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 2019 అక్టోబర్​24న విడుదల చేసిన 2015 గ్రూప్‌- 2 ఎంపిక జాబితాను రద్దు చేస్తూ హైకోర్టు  నవంబర్ 18 సంచలన తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. 2019లో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు, సాంకేతిక కమిటీ సిఫారసులకు విరుద్ధంగా వైట్‌నర్‌ వినియోగం, దిద్దుబాట్లు ఉన్న పార్ట్‌ -బీ జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయడం చెల్లదని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు, సాంకేతిక కమిటీ సిఫారసులకు విరుద్ధంగా వ్యవహరించే అధికారం టీజీపీఎస్సీకి లేదని పేర్కొంది.  ఆన్సర్​ షీట్లలో  ట్యాంపరింగ్‌ జరిగిందన్నది స్పష్టంగా ఉన్నప్పుడు వాటిని పక్కన పెట్టకపోవడం కమిషన్‌ వైఫల్యమేనని తప్పుబట్టింది.

 2019 అక్టోబర్​ 24న  ఇచ్చిన ఫలితాలు ఏకపక్షమని, చట్టవిరుద్ధమని, వాటిని రద్దు చేస్తున్నామని హైకోర్టు తెలిపింది. సాంకేతిక కమిటీ సిఫారసులు, హైకోర్టు గత తీర్పుకు తగ్గట్టు తిరిగి మూల్యాంకనం నిర్వహించి అర్హుల జాబితాను విడుదల చేసి నియామకాలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ 8 వారాల్లో పూర్తి చేయాలని కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై  టీజీపీఎస్ సీ  డివిజన్ బెంచ్ ను ఆశ్రయించగా కోర్టు  సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేస్తూ  తీర్పునిచ్చింది.