- బ్రెజిల్లో ఘోరం
బ్రెజీలియా: బంగీ జంప్ గేమ్ నిర్వాహకుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైపోయింది. 21 ఏండ్ల యువతిని సేఫ్టీ తాడు బిగించకుండానే130 అడుగుల ఎత్తు నుంచి కిందకు విసిరేశారు. దీంతో ఆమె స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్లోని లైమీరాలో శనివారం ఈ విషాదం జరిగింది.
సావోపాలో రాష్ట్రానికి చెందిన మరియా ఎడ్వార్డా రోడ్రిగ్స్ డి ఫ్రైటాస్(21) స్నేహితులతో కలిసి శనివారం అడ్వెంచర్ గేమ్స్కు వెళ్లారు. లైమీరాలోని స్కెలెటన్ బ్రిడ్జ్ దగ్గర నిర్వహించే బంగీ జంప్ ఫీట్ చేసేందుకు రెడీ అయ్యారు. సిబ్బంది ఆమెకు సేఫ్టీ రోప్ కట్టకుండానే బ్రిడ్జ్ అంచుకు తీసుకెళ్లి కిందకు తోసేశారు.
దీంతో ఆమె 130 అడుగుల ఎత్తు నుంచి అమాంతం లోయలో పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు స్పాట్కు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిర్వాహకులు మృతురాలికి సేఫ్టీ తాగు బిగించడం మర్చిపోయిన సంగతి బంగీ జంప్ చేస్తుండగా తీసిన వీడియోలో బయటపడింది. దీంతో సిబ్బంది ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
