213 మంది ఖైదీలు రిలీజ్

213 మంది ఖైదీలు రిలీజ్
  •     సత్ప్రవర్తన కలిగినవారికి క్షమాభిక్ష
  •     14 జైళ్ల నుంచి విడుదల
  •     ఖైదీలందరికీ ఉపాధి కల్పించాం: సౌమ్య మిశ్రా
  •     జైళ్ల శాఖ చరిత్రలో ఓ మైలు రాయి అన్న డీజీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా 213 మంది ఖైదీలను ప్రభుత్వం బుధవారం రిలీజ్ చేసింది. జైళ్లల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న వారిలో సత్పప్రవర్తన కలిగిన వారికి క్షమాభిక్ష ప్రసాదించింది. చర్లపల్లి సెంట్రల్ జైలుతో సహా స్టేట్​వైడ్​గా ఉన్న 13 జైళ్ల నుంచి 178 మంది పురుషులు, 35 మంది మహిళా ఖైదీలకు విముక్తి లభించింది. అత్యధికంగా చర్లపల్లి జైలు నుంచి 92 మంది ఖైదీలు విడుదలయ్యారు. 

ఈ మేరకు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఆధ్వర్యంలో చర్లపల్లి సెంట్రల్ జైల్లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. క్షమాభిక్షపై రిలీజ్ అవుతున్న ఖైదీలకు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వృత్తి విద్య నేర్చుకున్న వారికి ఉపాధి పత్రాలు అందజేసి సౌమ్య మిశ్రా మాట్లాడారు. ఖైదీలందరికీ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంకులు, ఇతర కుటీర పరిశ్రమల్లో ఉపాధి కలిగించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

 జైల్లో ఉంటూ.. అంబేద్కర్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన వారితో పాటు గోల్డ్ మెడల్ సాధించిన ఖైదీలను అభినందించారు. మహిళా ఖైదీలకు కుట్టు మిషన్లు అందజేశామని చెప్పారు. తెలంగాణ జైళ్ల శాఖ చరిత్రలో ఓ మైలు రాయి లాంటిదన్నారు. విడుదలైన వారిలో 205 మంది యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, ఎనిమిది మంది స్వల్ప కాలిక శిక్ష అనుభవిస్తున్న వారు ఉన్నారని తెలిపారు. 

వారందరికీ ఇది జీవితంలో రెండో అవకాశమని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జైళ్లల్లో శిక్షతో పాటు పని చేసుకుంటూ బతికేందుకు గాను పలు వృత్తి విద్య కోర్సుల్లో ట్రైనింగ్ కూడా ఇచ్చామన్నారు. మంచి పౌరులుగా మెరుగైన సమాజం కోసం పనిచేయాలని సూచించారు. ఖైదీల పట్ల కుటుంబం, సమాజం సానుభూతితో ఉండాలన్నారు.