న్యూయార్క్: అమెరికాలో కరోనా మరణాలు 2 వేలు దాటాయి. మొత్తంగా 2,484మంది మరణించారు. 1,42,070 మందికి వైరస్ సోకింది. ఎక్కువగా న్యూయార్క్లో 59,513 మంది కరోనా బాధితులున్నారు. అక్కడ 965 మంది చనిపోయారు. న్యూజెర్సీలో కేసుల సంఖ్య పది వేలు దాటింది. 11,124 మందికి వైరస్ సోకింది. 140 మంది చనిపోయారు. వాషింగ్టన్లో 189 మంది, లూసియానాలో 151, కాలిఫోర్నియాలో 123 , మిషిగన్లో 111 మంది చనిపోయారు. మరోవైపు కేసులు జైళ్లకు పాకాయి. వైరస్తో ఓ ఖైదీ చనిపోయాడు. లూసియానాలోని ఎఫ్సీఐ ఓకాడాలే 1 జైల్లో ఖైదీ చనిపోయినట్టు బ్యూరో ఆఫ్ ప్రిజన్స్ వెల్లడించింది. కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్లలో క్వారంటైన్కు ఆదేశించారు ట్రంప్. ఎవరూ ఇంట్లో నుంచి కదలొద్దని, అనవసర ప్రయాణాలను మానుకోవాలని సూచించారు. దీనిపై న్యూయార్క్ గవర్నర్ కువోమో మండిపడ్డారు. ఇది రాష్ట్రాలపై యుద్ధం ప్రకటించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశమంతా ఇలా ‘క్వారంటైన్ గోడలు’ కట్టుకుంటూ పోతే, దాని కన్నా దారుణమైన విషయం ఉండదని అసహనం వ్యక్తం చేశారు. దేశానికి ఆర్థిక రాజధాని అయిన న్యూయార్క్కు తాళం వేస్తే స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయన్నారు. దీంతో కొద్ది గంటల్లోనే ట్రంప్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు.
నర్సు బలి
మౌంట్ సినాయ్లో కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తున్న కియోస్ కెల్లీ (36) అనే నర్స్ కరోనాకు బలయ్యారు. ఇంకా చాలా మంది అనారోగ్యం పాలయ్యారు. బ్రాంక్స్ హాస్పిటల్లో నర్సులకు రక్షణ పరికరాలు, మాస్కులు, హజ్మత్సూట్లను రేషన్ పద్ధతిలో అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోవడం, మెడికో లకు డిమాండ్ ఎక్కువ కావడంతో… మెడికల్ సీనియర్ స్టూడెంట్లకు ముందుగానే గ్రాడ్యుయేషన్ ఇవ్వాలని పలు మెడికల్ కాలేజీలు భావిస్తున్నాయి. వైద్య సిబ్బంది అవసరం దృష్ట్యా ఈ ఆలోచన చేస్తున్నాయి. 70 మంది స్టూడెంట్లకు ముందే పట్టా ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు న్యూయార్క్ యూనివర్సిటీ వెల్లడించింది.
గన్నులూ ‘అత్యవసరమే’
మామూలుగా జనాలకు అత్యవసరమైనవి, రోజూ కావాల్సినవి.. తిండి, కూరగాయలు, కిరాణా, పాలు, మందుల వంటివి ఉంటాయి. కానీ, అమెరికాకు ‘గన్నులూ’ ముఖ్యమయ్యాయి. అవును, తుపాకులనూ అత్యవసర వస్తువుల కేటగిరీలో చేరుస్తూ సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ శనివారం ఆదేశాలను ఇచ్చింది. ఓ వారం క్రితం ఇచ్చిన ఆదేశాల్లో గన్నులను అవసరమైన వస్తువుల కేటగిరీలో సర్కార్ చేర్చలేదు. దీంతో గన్ రైట్స్ గ్రూపులు, అధికారుల మధ్య వాదనలు జరిగాయి. చాలా చోట్ల గన్ స్టోర్లను అధికారులు మూసేయించారు. దీనిపై మండిపడిన గన్ ఓనర్స్ ఆఫ్ అమెరికా గ్రూప్ సభ్యులు పోయిన శుక్రవారం కోర్టులో కేసు వేశారు.
ఏడాదిలోపు చిన్నారి మృతి..
అమెరికాలోని ఇల్లినాయీలో ఏడాదిలోపు వయస్సు ఉన్న చిన్నారి కరోనాతో చనిపోయినట్టు అధికారులు చెప్పారు. షికాగోకు చెందిన ఆ శిశువుకు టెస్టు చేయగా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ఇల్లినాయిస్ గవర్నర్ జెబీ ప్రిట్జ్ కెర్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కొవిడ్-19 చిన్న వయసు పిల్లలు మృతి చెందడం అత్యంత అరుదు అని అధికారులు తెలిపారు. ప్రపంచంలో కరోనాతో చిన్న వయసులో చనిపోయిన కేసు ఇదేనన్నారు. ఇటీవల ఫ్రాన్స్లో ఓ 16 ఏళ్ల బాలిక చనిపోయింది.