
- హైకమాండ్ ఆదేశాలతో రంగంలోకి మీనాక్షి నటరాజన్, మహేశ్ గౌడ్, పొన్నం
- కేబినెట్లో బెర్త్ దక్కని సీనియర్ల ఇండ్లకు వెళ్లి చర్చలు
- తదుపరి విస్తరణలో లేదా ఇతర పదవుల్లో ప్రాధాన్యమిస్తామని భరోసా
హైదరాబాద్, వెలుగు: మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కని సీనియర్ఎమ్మెల్యేలను హైకమాండ్బుజ్జగించే పనిలో పడింది. పార్టీ పెద్దల ఆదేశాలతో రంగంలోకి దిగిన పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ఆదివారం ఆయా నేతల ఇండ్లకు వెళ్లి మాట్లాడారు. త్వరలో చేపట్టే మంత్రివర్గ విస్తరణలో లేదా ఇతర పదవుల్లో ప్రాధాన్యత కల్పిస్తామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆదివారం చేపట్టిన కేబినెట్ విస్తరణలో సామాజిక సమీకరణాలకే హైకమాండ్ పెద్దపీట వేసింది.
మూడు మంత్రి పదవులు మాత్రమే భర్తీ చేయడంతో బీసీ, ఎస్సీ నేతలకు మినహా ఇతర సామాజిక వర్గాలకు చోటు దక్కలేదు. దీంతో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తికి లోనయ్యారు. వీరిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు. కేబినెట్ ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇంటికి మీనాక్షి నటరాజన్, మహేశ్ గౌడ్, పొన్నం వెళ్లి ఆయనతో మాట్లాడారు.
రాబోయే రోజుల్లో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ భరోసా ఇచ్చినట్లు సమాచారం. అలాగే ప్రేమ్ సాగర్ రావు ఇంటికి వెళ్లిన నేతలు ఆయనకు సైతం సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని నచ్చజెప్పారు. తర్వాత మల్రెడ్డి రంగారెడ్డి వద్దకు వెళ్లిన మహేశ్ గౌడ్, పొన్నం కూడా ఆయనకు తగిన ప్రాధాన్యం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక మల్రెడ్డి రంగారెడ్డితో మీనాక్షి నటరాజన్ ఫోన్ లో మాట్లాడారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, రాబోయే రోజుల్లో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
అలాగే మరో అసంతృప్త నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా బుజ్జగించేందుకు పీసీసీ నేతలు ప్రయత్నాలు చేశారు. అయితే, ఆయన పార్టీ నేతలెవరికీ అందుబాటులోకి రాలేదని తెలిసింది. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు జరగనుండడంతో పార్టీ నేతల్లో ఎలాంటి అసంతృప్తి లేకుండా, నేతల మధ్య సమన్వయం ఉండేలా చూసేందుకే హైకమాండ్ ఇటు మీనాక్షి నటరాజన్ ను అటు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ను రంగంలోకి దింపిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.