
- క్యూలో సెల్ఫోన్లు, ఆధార్కార్డులు..
కౌడిపల్లి, వెలుగు: మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం రైతులు యూరియా బస్తాల టోకెన్ల కోసం సెల్ ఫోన్, ఆధార్ కార్డ్ లు క్యూలో పెట్టారు. యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న ఆయా గ్రామాల రైతులు వర్షంలోనే రైతు వేదికకు చేరుకున్నారు. 400 బస్తాల యూరియా మాత్రమే వచ్చిందని అధికారులు చెప్పడంతో తమకు అందుతుందో లేదో అన్న ఆత్రుతతో రైతులు గుంపుగా ఎగబడ్డారు.
దీంతో పోలీసులు రైతు వేదికకు చేరుకొని వారిని క్యూలో నిలబెట్టి సముదాయించారు. సెల్ ఫోన్లు, ఆధార్ కార్డులు వరుసలో పెట్టి రైతు వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తూ టోకెన్లు పంపిణీ చేశారు. రైతులు ఎక్కువ మంది రావడంతో కొంతమందికి మాత్రమే యూరియా అందగా, మరికొంతమంది వెనుతిరిగి వెళ్లిపోయారు.
యూరియా కోసం బారులు
కోహెడ(హుస్నాబాద్): హుస్నాబాద్ పీఎసీఎస్కు సోమవారం యూరియా రావడంతో రైతులు బారులు తీరారు. గంటల తరబడి క్యూలో ఉన్నా కొందరికి యూరియా దొరకలేదు. రైతులకు సరిపడ యూరియాను అందించాలని బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. యూరియాను సకాలంలో అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయిందని ఆరోపించారు. కార్యక్రమంలో చంద్రయ్య, మల్లికార్జున్ రెడ్డి, శ్రీనివాస్ ఉన్నారు.