
- మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం: మహేశ్ గౌడ్
హైదరాబాద్/మలక్పేట, వెలుగు: సామాజిక సమతుల్యతను పాటిస్తూ మంత్రివర్గ విస్తరణ చేపట్టామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. త్వరలోనే మరో మూడు మంత్రి పదవులను భర్తీ చేస్తామని వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్లోని మలక్పేటలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇంట్లో మీడియాతో మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడారు. అలాగే ప్రకటన కూడా విడుదల చేశారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మంత్రివర్గ విస్తరణతో ఇది మరోసారి రుజువైందని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్నది. అందుకే రాష్ట్రంలో కులగణన చేసిబడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా ప్రాధాన్యం ఇస్తున్నాం. కులగణనతో దేశానికే తెలంగాణ రోల్ మోడల్గా నిలుస్తున్నది” అని పేర్కొన్నారు. కొత్త మంత్రులు వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరికి శుభాకాంక్షలు చెప్పారు. మంత్రివర్గ విస్తరణలో బీసీ, ఎస్సీలకు ప్రాధాన్యం కల్పించినందుకు సోనియా, రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్కు కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీకి విధేయుడిగా ఉంటా: మల్రెడ్డి
కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ విధేయుడిగా ఉంటానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. మంత్రివర్గంలో రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం ఉండాలని నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారని.. ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. గతంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచే ఆరుగురు మంత్రులు ఉండేవారని పేర్కొన్నారు.