వైన్స్ ల ను తరలించాలని స్థానికుల ఆందోళన

వైన్స్ ల ను తరలించాలని స్థానికుల ఆందోళన
  • స్థానికుల భారీ ర్యాలీ.. ఉద్రిక్తత

ఉప్పల్, వెలుగు: ఉప్పల్ భగాయత్ లో కొత్తగా ఏర్పాటు చేసిన వైన్స్​ను ఇక్కడి నుంచి తరలించాలని ఆదివారం వందలాది మంది మహిళలు, పురుషులు, చిన్నారులు ఆందోళనకు దిగారు. ఫ్లెక్సీలు, ప్లకార్డులతో భారీ ర్యాలీగా వెళ్లి వైన్ షాప్ ఎదుట ధర్నా చేశారు.  వివిధ పార్టీలు, మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి. వైన్స్​ను  మూసివేయించే ప్రయత్నం చేయగా పోలీసులు వెళ్లి  అడ్డుకొని నచ్చజెప్పినా వినకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు షాప్​ను  మూసివేయించారు. 

ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, ఉప్పల్ భగాయత్ అసోసియేషన్ లీడర్లు మేకల మధుసూదన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కాలభైరవ ఆలయానికి సమీపంలో, రెసిడెన్షియల్ ఏరియాలో వైన్స్​ ఏర్పాటుతో మందుబాబులు రోడ్డుపై మద్యం తాగుతూ గొడవలకు దిగుతున్నారని,  దీంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోందన్నారు. వైన్స్​ను తరలించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నేతలు ఫణీందర్, సందీప్, నవీన్, సందీప్ రెడ్డి,  మంజుల,  గాయత్రి, స్వప్న, మాధవి, భాగ్య, కీర్తన తదితరులు పాల్గొన్నారు.

సాయిప్రియ కాలనీలో.. 

జవహర్ నగర్ : దమ్మాయిగూడ సాయిప్రియ కాలనీలో వైన్స్​ఏర్పాటు చేయొద్దని స్థానికులు డిమాండ్ ​చేశారు. వైన్​షాపు ఎదుట  ప్లకార్డులతో ధర్నాకు దిగారు. వైన్స్ తో  రోజూ సాయంత్రం మహిళలు, విద్యార్థినుల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని తెలిపారు.  పోలీసులు వచ్చి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఆందోళనను విరమింపజేశారు.