జెమీమా జోరు.. తొలి టీ20లో ఇండియా అమ్మాయిల విక్టరీ

జెమీమా జోరు.. తొలి టీ20లో ఇండియా అమ్మాయిల విక్టరీ

 

  • 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలుపు.. రాణించిన మంధాన, బౌలర్లు

విశాఖపట్నం:  శ్రీలంకతో ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌లో ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ జట్టు బోణీ చేసింది. చిన్న టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో జెమీమా రోడ్రిగ్స్‌‌‌‌‌‌‌‌ (44 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 10 ఫోర్లతో 69 నాటౌట్‌‌‌‌‌‌‌‌) జోరు చూపెట్టడంతో.. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా 8 వికెట్ల తేడాతో లంకను ఓడించింది. ఫలితంగా సిరీస్‌‌‌‌‌‌‌‌లో 1–0 ఆధిక్యంలో నిలిచింది. టాస్‌‌‌‌‌‌‌‌ ఓడిన శ్రీలంక 20 ఓవర్లలో 121/6 స్కోరు చేసింది. విష్మీ గుణరత్నే (43 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 1 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 39) టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌. తర్వాత ఇండియా 14.4 ఓవర్లలో 122/2 స్కోరు చేసి నెగ్గింది. జెమీమాకు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టీ20 మంగళవారం ఇదే వేదికపై జరుగుతుంది. 

బౌలర్లు ఓకే..

ముందుగా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన లంకను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో ఇండియా బౌలర్లు సక్సెస్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. మూడో ఓవర్‌‌‌‌‌‌‌‌లోనే కెప్టెన్‌‌‌‌‌‌‌‌ చామరి ఆటపట్టు (15)ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేశారు. అయితే ఓ ఎండ్‌‌‌‌‌‌‌‌లో విష్మీ నిలకడగా ఆడగా... రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌లో హాసిని పెరీరా (20) అండగా నిలిచింది. ఈ ఇద్దరు ఇండియా బౌలింగ్‌‌‌‌‌‌‌‌ను దీటుగా ఎదుర్కోవడంతో పవర్‌‌‌‌‌‌‌‌ప్లేలో లంక 31/1 స్కోరు చేసింది. ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌ పెరిగిన తర్వాత సింగిల్స్‌‌‌‌‌‌‌‌, డబుల్స్‌‌‌‌‌‌‌‌తో స్ట్రయిక్‌‌‌‌‌‌‌‌ రొటేట్‌‌‌‌‌‌‌‌ చేశారు. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని 10వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో దీప్తి శర్మ (1/20) ఔట్‌‌‌‌‌‌‌‌ చేసింది. ఫలితంగా రెండో వికెట్‌‌‌‌‌‌‌‌కు 31 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ముగిసింది. ఈ దశలో వచ్చిన హర్షిత (21) వేగంగా ఆడింది. విష్మీ కూడా బ్యాట్‌‌‌‌‌‌‌‌ ఝుళిపించడంతో రన్‌‌‌‌‌‌‌‌రేట్‌‌‌‌‌‌‌‌ పెరిగింది. మూడో వికెట్‌‌‌‌‌‌‌‌కు 38 రన్స్‌‌‌‌‌‌‌‌ జత చేసి హర్షిత వెనుదిరగడంతో లంక స్కోరు 87/3గా మారింది. ఇక్కడి నుంచి ఇండియా బౌలర్లు పట్టు బిగించడంతో విష్మీ రనౌటైంది. తర్వాత వచ్చిన నీలాక్షిక సిల్వ (8), కవిషా దిల్హారి (6) నిరాశపర్చగా, కౌశిని నూత్యంగన (9 నాటౌట్‌‌‌‌‌‌‌‌) వేగంగా ఆడటంతో లంక ఆ మాత్రం స్కోరైనా చేసింది.  శ్రీచరణి, క్రాంతి గౌడ్‌‌‌‌‌‌‌‌ చెరో వికెట్‌‌‌‌‌‌‌‌ తీశారు. 

షెఫాలీ ఫెయిలైనా..

ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో ఇండియాకు సరైన ఆరంభం దక్కలేదు. రెండో ఓవర్‌‌‌‌‌‌‌‌లోనే ఓపెనర్‌‌‌‌‌‌‌‌ షెఫాలీ వర్మ (9) ఔటైంది. 13/1 స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన జెమీమా ఒంటిచేత్తో మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను గెలిపించింది. రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌లో స్మృతి మంధాన (25) వేగంగా ఆడింది. ఈ ఇద్దరు పోటీపడి బౌండ్రీలు బాదడంతో పవర్‌‌‌‌‌‌‌‌ప్లేలో ఇండియా 55/1 స్కోరుతో మంచి స్థితిలో నిలిచింది. అయితే 9వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో స్మృతి ఔటైనా.. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌ (15 నాటౌట్‌‌‌‌‌‌‌‌) అండగా నిలిచింది. లంక బౌలింగ్‌‌‌‌‌‌‌‌ను ఉతికేసిన జెమీమా 34 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసింది. ఆ తర్వాత కూడా దూకుడు కొనసాగించడంతో పాటు హర్మన్‌‌‌‌‌‌‌‌తో మూడో వికెట్‌‌‌‌‌‌‌‌కు 55 రన్స్‌‌‌‌‌‌‌‌ జత చేసి మరో 32 బాల్స్‌‌‌‌‌‌‌‌ మిగిలి ఉండగానే ఈజీగా విజయాన్ని అందించింది. కావ్య, ఇనోకా చెరో వికెట్‌‌‌‌‌‌‌‌ తీశారు. 

సంక్షిప్త స్కోర్లు

శ్రీలంక: 20 ఓవర్లలో 121/6 (విష్మీ గుణరత్నే 39, హర్షిత 21, హాసిని 20, దీప్తి శర్మ 1/20). 
ఇండియా: 14.4 ఓవర్లలో 122/2 (జెమీమా 69*, స్మృతి 25, కావ్య 1/20, ఇనోకా 1/17). 

1 విమెన్స్  టీ20ల్లో 4 వేల రన్స్‌‌‌‌‌‌‌‌ చేసిన తొలి ఇండియన్‌‌‌‌గా స్మృతి మంధాన (4007) రికార్డుకెక్కింది.