అడిలైడ్: ఇంగ్లండ్తో ప్రతిష్టాత్మక యాషెస్ టెస్ట్ సిరీస్ను ఆస్ట్రేలియా నిలబెట్టుకుంది. బౌలర్లు సత్తా చాటడంతో.. ఆదివారం ముగిసిన మూడో టెస్ట్లోనూ ఆసీస్ 82 రన్స్ తేడాతో ఇంగ్లండ్పై గెలిచింది. ఫలితంగా ఐదు టెస్టుల సిరీస్లో మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే కంగారూలు 3–0తో సొంతం చేసుకున్నారు. 435 రన్స్ లక్ష్య ఛేదనలో భాగంగా 207/6 ఓవర్నైట్ స్కోరుతో ఐదో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 102.5 ఓవర్లలో 352 రన్స్కే పరిమితమైంది.
ఆఖరి రోజు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఆసీస్ విజయానికి నాలుగు వికెట్లు అవసరం కాగా, ఇంగ్లండ్ 228 రన్స్ చేయాల్సి ఉంది. జెమీ స్మిత్ (60)తో ఏడో వికెట్కు 91 రన్స్ జోడించిన విల్ జాక్స్ (47).. బైడన్ కార్సీ (39 నాటౌట్)తో ఎనిమిదో వికెట్కు 52 రన్స్ జత చేసి విజయంపై ఆశలు రేకెత్తించాడు. కానీ అద్భుతమైన బౌలింగ్ చేసిన స్టార్క్ (3/62) చివరి నాలుగు వికెట్లలో మూడు పడగొట్టి ఆసీస్కు విజయాన్ని అందించాడు. ఆర్చర్ (3), జోష్ టంగ్ (1) నిరాశపర్చారు. అలెక్స్ కెరీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఓవరాల్గా ఇంగ్లండ్ చివరిసారిగా ఆస్ట్రేలియాలో టెస్ట్ మ్యాచ్ గెలిచి 5,462 రోజులు అయ్యింది. చివరిసారి 2011లో నెగ్గింది. అప్పట్నించి నుంచి ఆస్ట్రేలియన్లు 5–0, 4–0, 4–0, 3–0తో యాషెస్ సిరీస్లు గెలుస్తూనే ఉన్నారు. ఇరుజట్ల మధ్య మెల్బోర్న్లో ఈ నెల 26 నుంచి బాక్సింగ్ డే టెస్ట్ జరుగుతుంది.
