
హైదరాబాద్, వెలుగు: మంత్రిగా ప్రమాణం చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడలోని వివేక్ ఇంటి వద్ద ఆదివారం ఉదయం నుంచే సందడి నెలకొంది. రాష్ర్టంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు ప్రమాణస్వీకారానికి ముందు, ఆ తర్వాత ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పటాకులు కాల్చి సందడి చేశారు.
‘వివేక్ వెంకటస్వామి నాయకత్వం వర్ధిల్లాలి’, ‘జోహార్ కాకా’ అంటూ నినాదాలు చేశారు. పూల బొకేలు, గజమాలలతో వివేక్ను సన్మానించారు. డప్పులు వాయిస్తూ కార్యకర్తలతో పాటు కాకా, వివేక్ అభిమానులు డ్యాన్సులు చేశారు. ప్రమాణస్వీకారం తర్వాత వివేక్ నివాసానికి చేరుకున్న పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ.. కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేశారు. వాళ్లతో కలిసి నాలుగైదు స్టెప్పులు వేశారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీని ఎత్తుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు.
నియోజకవర్గంలోనూ..
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి దక్కడంతో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, మాల సంఘం నేతలు సంబురాలు చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్, బెల్లంపల్లిలోని కాకా వెంకటస్వామి విగ్రహం వద్ద, మందమర్రి, భీమారం, జైపూర్ మండల కేంద్రాల్లో సంబురాలు జరిగాయి. పలుచోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు, దళిత సంఘాల నాయకులు పటాకులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు.
నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్త..
మాదిగ వర్గానికి చెందిన నాకు, మాల వర్గానికి చెందిన వివేక్ వెంకటస్వామికి, ముదిరాజ్ వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి మంత్రులుగా అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాను. కాంగ్రెస్లో సామాన్య కార్యకర్తగా నా జీవితం మొదలైంది. ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్లో పని చేసి జడ్పీ చైర్మన్గా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా సేవలందించాను. స్వల్ప ఓట్ల తేడాతో గత ఎన్నికల్లో ఓడిపోయాను. ఈసారి ప్రజలు నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించారు. ఇప్పుడు మంత్రిగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి అవకాశమిచ్చారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వెనుకబడిన వర్గాల గొంతుకనవుతా..
30 ఏండ్ల నుంచి పార్టీ కోసం సైనికుడిలా పని చేస్తున్న నాకు మంత్రిగా అవకాశం దక్కింది. వెనుకబడిన తరగతులకు కాంగ్రెస్ అండగా ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఈ అవకాశం ఇచ్చారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇప్పటికీ పార్లమెంట్, అసెంబ్లీకి వెళ్లని కులాలు చాలా ఉన్నాయి. అందుకే కులగణన చేయాలని రాహుల్ డిమాండ్ చేస్తున్నారు. మారుమూల నియోజకవర్గమైన మక్తల్ నుంచి నేను గెలిచాను. సర్పంచ్ స్థాయి నుంచి పార్టీనే నమ్ముకొని కష్టపడినందుకు నాకు ఈ గౌరవం దక్కింది. నా మీద ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాను. వెనుకబడిన వర్గాల గొంతుకగా పని చేస్తాను.
మంత్రి వాకిటి శ్రీహరి
కాకా పేరు నిలబెడతా..
నాకు మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు. ప్రజలకు సేవ చేయడానికి ఇది గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఏ శాఖ ఇచ్చినా బాధ్యతతో పని చేస్తాను. కాకా వెంకటస్వామి పేరు నిలబెడతాను. కాకా కుటుంబం అంటే ప్రజాసేవకు మారుపేరు. కాకా ట్రస్ట్ ద్వారా విద్యాసంస్థలు ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలకు విద్య అందిస్తున్నాం. స్కూళ్లలో మౌలిక వసతులు, గ్రామాల్లో తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నాం. నా తండ్రి, కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చాను. తెలంగాణ కోసం అప్పటి సహచర ఎంపీలతో కలిసి పార్లమెంట్లో పోరాడాను. తెలంగాణ ఉద్యమంలో, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొన్నాను. నిరంకుశ పాలనపై పోరాడాను.
మంత్రి వివేక్ వెంకటస్వామి