
- యాదాద్రిలో టార్గెట్ చేరుకోలే
- సూర్యాపేటలో కాస్తా తక్కువే..
యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, వెలుగు : ఎట్టకేలకు వడ్ల కొనుగోళ్లు కంప్లీట్అయ్యాయి. కొనుగోలు సమయంలో అక్కడడక్కడా కొంత ఇబ్బందులు కలిగినా చివరకు అంతా సాఫీగా జరిగిపోయింది. యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో టార్గెట్ చేరుకోలేక పోయింది. నల్గొండలో మాత్రం టార్గెట్కు మించి ధాన్యం కొనుగోలు చేశారు. అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా మిల్లరు పెద్ద ఎత్తున వడ్లు కొనగోళ్లు చేశారు.
యాదాద్రిలో టార్గెట్కు తక్కువగా..
యాసంగిలో యాదాద్రి జిల్లాలో 2.80 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ సీజన్లో ఎక్కువగా దొడ్డు రకం పండిస్తున్నందున 7 లక్షల టన్నుల వరకు దిగుబడి వస్తుందని ఆఫీసర్లు అంచనా వేశారు. సెంటర్లకు 4.50 లక్షల టన్నులు వస్తుందన్న అంచనాతో జిల్లాలో 375 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో సన్నవడ్ల కొనుగోలు కోసం 50 సెంటర్లు ఏర్పాటు చేశారు. అయితే అక్కడడక్కడా కొంత ఇబ్బందులు ఎదురైనా రెండు నెలలపాటు కొనుగోళ్లు జరిగాయి.
అయితే మిల్లర్లు రంగంలోకి దిగి ధాన్యం కొనుగోళ్లు చేస్తుండడంతో సివిల్సప్లయ్ టార్గెట్కు చేరుకోలేకపోయింది. చివరకు రూ.849.33 కోట్ల విలువైన 3,67,479 టన్నుల వడ్లు కొనుగోలు చేసింది. ఇందులో సన్నవడ్లు కేవలం 950 టన్నులు మాత్రమే ఉన్నాయి. మిల్లర్లు మాత్రం దాదాపు 3 లక్షల టన్నుల వరకు వడ్లు కొనుగోళ్లు చేశారు.
సూర్యాపేట జిల్లాలో..
సూర్యాపేట జిల్లాలో ఈ సీజన్ లో టార్గెట్ కంటే కాస్తా తక్కువే వడ్లు కొనుగోలు చేశారు. ఈ సీజన్ లో 3.50 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని టార్గెట్ గా పెట్టుకొని 312 సెంటర్లు ఏర్పాటు చేశారు. 54 వేల మంది రైతుల నుంచి రూ.776 కోట్ల విలువైన 3.40 లక్షల టన్నుల వడ్లను కొనుగోలు చేశారు. గత యాసంగి సీజన్ లో 312 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 2,40,578 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఈసారి లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికంగా కొనుగోలు చేయడం గమనార్హం.
నల్గొండలో టార్గెట్ మించి..
నల్గొండ జిల్లాలో టార్గెట్ మించి వడ్ల కొనుగోళ్లు జరిగాయి. కొనుగోళ్లలో నల్గొండ రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలిచింది. ఈ సీజన్ లో 5.50 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేయాలని టార్గెట్ గా పెట్టుకొని అందుకనుగుణంగా 375 సెంటర్లు ఏర్పాటు చేశారు. 84,619 మంది రైతుల నుంచి రూ.1,375 కోట్ల విలువైన 5.97 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేశారు. ఇందులో 20,772 టన్నులు సన్నరకం, 5,76,228 టన్నులు దొడ్డు రకం వడ్లు కొనుగోలు చేశారు.