
న్యూఢిల్లీ: బ్లడ్ షుగర్, ఊబకాయం తగ్గడానికి ఎలీ లిల్లీ తీసుకొచ్చిన మందు మౌంజారో (టిర్జెపటైడ్) కి ఇండియాలో మంచి డిమాండ్ కనిపిస్తోంది. లాంచ్ అయిన మూడు నెలల్లోనే రూ.24 కోట్ల విలువైన సేల్స్ జరిగాయి. ఈ ఏడాది మార్చిలో భారత్లో టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం చికిత్స కోసం మౌంజారోని కంపెనీ లాంచ్ చేసింది. ఫార్మారాక్ సేకరించిన ఇండియన్ ఫార్మా మార్కెట్ డేటా ప్రకారం, మార్చిలో లాంచ్ అయినప్పటి నుంచి డాక్టర్ల ప్రిస్క్రిప్షన్స్, పేషెంట్స్ వాడకం పెరుగుతోంది.
ఈ ఏడాది మార్చిలో రూ. 3.46 కోట్ల విలువైన 11,640 యూనిట్స్ అమ్ముడు కాగా, ఏప్రిల్లో రూ. 7.87 కోట్ల విలువైన 27,650 యూనిట్స్, మేలో రూ.12.60 కోట్ల విలువైన 42,280 యూనిట్స్ సేల్ అయ్యాయి. మొత్తం రూ. 23.94 కోట్ల విలువైన 81వేలకు పైగా యూనిట్స్ను కంపెనీ అమ్మింది. మౌంజారో వారానికి ఒకసారి ఇంజెక్షన్గా వేసుకోవాలి. 2.5 ఎంజీ ఇంజెక్షన్ ధర రూ. రూ.3,500, 5 ఎంజీ ఇంజెక్షన్ ధర రూ.4,375. 2.5 ఎంజీ వాడే వారికి నెలకు రూ.14 వేలు ఖర్చవుతుంది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) నుంచి అనుమతులు పొందాక ఈ డ్రగ్ను ఇండియాలో లాంచ్ చేశారు.