- రానున్న పదేళ్లలో డేటా సెంటర్స్, సిమెంట్ సెక్టార్లలో ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటన
- భారీ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చిన రిలయన్స్.. కర్నూలులో ఫుడ్ పార్క్ ఏర్పాటు
విశాఖపట్నం: గౌతమ్ అదానీ గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో వచ్చే 10 ఏళ్లలో రూ. లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతుందని అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ఎండీ కరణ్ అదానీ ప్రకటించారు. విశాఖపట్నంలో సీఐఐ శుక్రవారం నిర్వహించిన పార్ట్నర్షిప్ ఇన్వెస్ట్మెంట్సమిట్లో ఆయన ఈ విషయం చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో రూ.40వేల కోట్ల పెట్టుబడులు పెట్టామని, పోర్టులు, సిమెంట్, డేటా సెంటర్లు, ఎనర్జీ, అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో మరింతగా ఇన్వెస్ట్ చేస్తామని అన్నారు.
గూగుల్తో కలిసి రానున్న ఐదేళ్లలో విశాఖలో 15 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.32 లక్షల కోట్ల) తో వైజాగ్ టెక్ పార్క్ను అదానీ గ్రూప్ నిర్మించనుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ పవర్డ్ హైపర్స్కేల్ డేటా సెంటర్ ఎకోసిస్టమ్గా నిలుస్తుందని అంచనా. అదానీ గ్రూప్ నుంచి అదానీ కనెక్స్ (అదానీ గ్రూప్– ఎడ్జ్కనెక్స్ జేవీ) ఈ ప్రాజెక్టును మేనేజ్ చేస్తుంది. సబ్సీ కేబుల్ నెట్వర్క్, రెన్యూవబుల్ ఎనర్జీ, ట్రాన్స్మిషన్ లైన్లు, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ కూడా ఇందులో ఏర్పాటు చేయనున్నారు.
ఇండియాలో పెరుగుతున్న ఏఐ డిమాండ్ను తీర్చడానికి ఈ ప్రాజెక్ట్ సాయపడుతుందని, గూగుల్తో పాటు భారతి ఎయిర్టెల్తో కలిసి పనిచేయడానికి వీలుంటుందని అదానీ గ్రూప్ పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటికే ఒక లక్షకు పైగా ఉద్యోగాలు సృష్టించామని, కొత్త పెట్టుబడుల్లో కూడా అదే వేగం, స్థాయిని కొనసాగిస్తామని కరణ్ అదానీ హామీ ఇచ్చారు.
రిలయన్స్ కూడా రూ.లక్ష కోట్లు
అదానీ గ్రూప్, గూగుల్ కలిసి ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ స్థాయిలో తామూ ఆంధ్రాలో డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ సందర్భంగా ప్రకటించింది. గిగావాట్ (జీడబ్ల్యూ) ఏఐ డేటా సెంటర్ను నిర్మిస్తామని, ఇందులో గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్(జీపీయూలు), టెన్సార్ ప్రాసెసింగ్ యూనిట్స్ (టీపీయూలు), ఏఐ ప్రాసెసర్లు ఉంటాయని పేర్కొంది. గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్కు ఇది పోలి ఉంటుందని రిలయన్స్ ప్రకటించింది.
ఆంధ్రా ప్రభుత్వం డేటా సెంటర్ సెక్టార్లో ఇప్పటికే గూగుల్తో గిగావాట్, సిఫీతో 500 మెగావాట్ల డేటా సెంటర్ల కోసం ఒప్పందాలు కుదుర్చుకుంది. డేటా సెంటర్కు కరెంట్ సప్లయ్ చేసేందుకు 6 జీడబ్ల్యూ సామర్ధ్యం గల సోలార్ ప్రాజెక్ట్ను కూడా అభివృద్ధి చేయనుంది. మరోవైపు కర్నూలులో 170 ఎకరాల్లో గ్రీన్ఫీల్డ్ ఫుడ్ పార్క్ నిర్మిస్తుంది. ఇందులో సాఫ్ట్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ వాటర్, చాక్లెట్లు, స్నాక్స్ వంటివి తయారు చేయనుంది. వీటి కోసం పదేళ్లో మొత్తం రూ. లక్ష కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని వెల్లడించింది.
